భీమారం, మార్చి 20: కొంతకాలంగా వడ్ల బస్తాలను దొంగతనం చేస్తూ అమ్ముకుంటున్న దొంగల ముఠాను భీమారం పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరాంపూర్ సర్కిల్ సీఐ డీ మోహన్, భీమారం ఎస్ఐ రాములు బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భీమారం మండల కేంద్రంలోని కొత్తగూడెం కాలనీకి చెందిన మల్లెత్తుల ప్రశాంత్, మండల కేంద్రానికి చెందిన దాసరి చంద్రమౌళి, పందుల మధుకర్, బొంతల మధుకర్, మల్లెత్తుల రమేశ్ వ్యవసనాలకు బానిసై స్థానికంగా ఉన్న గోడౌన్లో కొన్ని నెలలుగా వడ్లను దొంగలిస్తున్నారు.
దొంగలించిన వడ్లను మహారాష్ట్రలోని బ్రోకర్లకు అమ్ముతుండేవారు. ఇదే క్రమంలో హాజీపూర్ మండలంలోని నర్సింగాపూర్లోని దుర్గ ఇండస్ట్రీ పోలంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దర్శనాల రమేశ్ది కాగా, 2022-23కి చెందిన వరిధాన్యాన్ని ఇక్కడ భద్రపరుచుకుంటున్నాడు. ఈ నెల 16న రాత్రి 10.30 గంటలకు గోడౌన్కు రెండు ట్రాలీల్లో(టీఎస్ 19టీ-5991, టీఎస్11యూసీ 1157) ఐదుగురు వచ్చారు.
గోదాం తాళాలను పగులగొట్టి 20 వడ్ల బస్తాలను ట్రాలీలో వేసే క్రమంలో స్థానికుడు ఎరుకలి కొండయ్య చూసి దర్శనాల రమేశ్కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో దర్శనాల రమేశ్ ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. ఐదుగురు నిందితులను పట్టుకొని, రెండు ట్రాలీ ఆటోలు, రూ. 59 వేలు, 20 వడ్ల బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, ఇందులో మల్లెత్తుల ప్రశాంత్ కొంతకాలంగా గోదాం వర్కర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు.