మందమర్రి, మార్చి 26 : మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు బుధవారం మందమర్రి పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ వివరాలు వెల్లడించారు. మూడు రోజుల క్రితం నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారమందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టి ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడైన నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన అబ్దుల్ రజాక్ను పట్టుకొని విచారణ చేపట్టగా, పొన్నారం గ్రామానికి చెందిన బొలిశెట్టి జనార్దన్, పట్టణానికి చెందిన కాశిపాక తిరుపతికి నకిలీ విత్తనాలు విక్రయించినట్లు తెలిపాడు.
దేవాపూర్, చింతగూడ గ్రామ సమీపంలోని సల్పలవాగులో నకిలీ విత్తనాలు దాచి.. వీలున్నప్పుడల్లా రైతులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అనంతరం నిందితుల వద్ద రూ. 7,87,500 విలువైన 3.15 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేసిన సీఐ శశీధర్ రెడ్డి, ఎస్ఐ ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ పున్నం చందు, నిమ్మల సంపత్, గుణంతరావు, కానిస్టేబుళ్లు మహేశ్, షఫీ, సురేందర్, సమ్మయ్య, రాకేశ్, రవి, తిరుపతి, రమేశ్లను ఆయన అభినందించారు.