హిందూ సంప్రదాయంలో విజయదశమి విశిష్టమైన రోజు. చెడుపై ‘మంచి’ సాధించిన విజయానికి ప్రతీకగా చెప్పుకునే దసరా పండుగను బుధవారం వైభవంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఆలయాలన్నింటినీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పలుచోట్ల రామ్లీలా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. – చెన్నూర్ టౌన్/కాగజ్నగర్ టౌన్, అక్టోబర్ 4
చెన్నూర్ టౌన్, అక్టోబర్ 4 : దసరా.. హిందువుల ప్రధాన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు. పదో రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచేయచ పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతి దేవికి, తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి, తర్వాత మూడు రోజులు సరస్వతీ దేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. తెలుగువారు దసరాను పది రోజులు నిర్వహిస్తారు. తెలంగాణ లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. పలు చోట్ల ‘రామ్లీలా’ నిర్వహిస్తుంటారు. ఇందుకోసం మైదానాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోధ, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్థ, అన్యాయ, అమానవత, అహంకారం అనే పది దుర్గుణాలను తొలగించుకునేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమమైన మార్గం ఈ శరన్నవరాత్రులు. దీనిని పది రోజుల పాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రుల్లో దుర్గాపూజ ఉంటుంది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మిచెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజుగా చెబుతుంటారు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకు పూజ చేయడం ఆనవాయితీగా వస్తున్నది. జగన్మాత అయిన దుర్గాదేవి, మహిషాసురుడనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొంది న సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంగా పండు గ జరుపుకున్నారు. అదే విజయదశమిగా పేర్కొంటారు.
బ్రహ్మదేవుడి వరాలతో వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషుడిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజం ముఖంగా, విష్ణు తేజం బాహువులుగా, బ్రహ్మతేజం పాదాలుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణ దేవుడు పాశం, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలం హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుడి సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషాసుర రూపం, సింహరూపం, మానవ రూపంతో భీకరంగా పోరు, చివరకు మహిషి రూపంలో దేవి చేతిలో హతుడయ్యాడు. అప్పటి నుంచి మహిషుడిని సంహరించిన రోజు దసరా పర్వదినంగా పిలుస్తారు. అదే విజయదశమి రోజునే శమీ పూజ కూడా నిర్వహిస్తారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మిచెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమీ అంటే పాపాల్ని, శత్రువులను నశింపజేసేది. పంచపాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను శమీ చెట్టుపై పెట్టారు. సామాన్యులే కాకుండా యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ఆలయాల్లో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజిస్తారు.