వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ జనం భగ్గుమన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఆందోళనలు నిర్వహించారు. ర్యాలీలతో హోరెత్తించారు. రోడ్డుపై ఖాళీ సిలిండర్లతో బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్రం, మోదీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రహదారులపై కట్టెల పొయ్యిలతో వంటావార్పు నిర్వహించారు. ముథోల్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆదిలాబాద్/నిర్మల్, మార్చి 2(నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని మోదీ సర్కారు వంటగ్యాస్ సిలిండర్ ధరను పెంచడాన్ని నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం ఆందోళనలు కొనసాగాయి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బోథ్ మండలం మందబోర గ్రామంలో ఎంపీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలు, బీఆర్ఎస్ శ్రేణులు ఖాళీ సిలిండర్లతో నిరసన చేపట్టాయి. భీంపూర్ మండలం కేంద్రంలో కూడా ఆందోళనలు నిర్వహించారు. ఇచ్చోడలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, నాయకులు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఆదిలాబాద్లో జరిగే ఆందోళన కార్యాక్రమాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న, ఇచ్చోడలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొననున్నారు.
నిర్మల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వివేకానంద చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి, బైఠాయించారు. ప్లకార్డులను ప్రదర్శించి, దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో మెమొరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నాయకులు పాల్గొన్నారు. ముథోల్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డి పాల్గొన్నారు. భైంసా-బాసర ప్రధాన రహదారిపై నయాబాదీ చౌరస్తాలో ధర్నా నిర్వహంచారు.
బెల్లంపల్లి/చెన్నూర్ రూరల్/జైపూర్/మందమర్రి/రామకృష్ణాపూర్/కోటపల్లి/భీమారం, మార్చి 2 : కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడంపై గురువారం నిరసనలు హోరెత్తాయి. అన్ని వర్గాల ప్రజలతోపాటు బీఆర్ఎస్ శ్రేణులు ఖాళీ సిలిండర్లను ప్రదర్శిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చెన్నూర్ బస్టాండ్ ప్రధాన రహదారిపై మున్సిపల్ చైర్పర్సన్ అర్చన గిల్డా, నాయకులు నిరనస చేపట్టారు. కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జైపూర్లో బీఆర్ఎస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మందమర్రి పట్టణంలోని సింగరేణి సీఈఆర్ క్లబ్ సమీపంలో కోల్బెల్ట్ రహదారిపై బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జే.రవీందర్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంట పాటు బైఠాయించారు. ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. పాతబస్టాండ్, రామకృష్ణాపూర్ వైపు వెళ్లాల్సిన వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమ్మగార్డెన్ సమీపంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు రోడ్డుపై ధర్నా చేశారు. కోటపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు కోటపల్లి-చెన్నూర్ రహదారిపై భైఠాయించి మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. భీమారం మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు నిరసనలు వ్యక్తం చేశారు. భీమారం మండల కేంద్రంలో మంచిర్యాల – చెన్నూర్ జాతీయ రహదారిపై గ్యాస్ మొద్దులతో నిరసన వ్యక్తం చేశారు. మహిళలు వంటావార్పు చేశారు. బెల్లంపల్లి పట్టణంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలపై బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు నిరసన వ్యక్తం చేశారు.
నా పేరు పవార్ ఉంద్రిబాయి. నేను భీంపూర్ల ఉంట. నాకు 64 ఏండ్లుంటయ్. నా పెనిమిటి కాలం జేసిండు. కూలీనాలీ జేసుకొని పొట్టపోసుకుంట. కేసీఆర్ సారు నెలనెలా ఇచ్చే పింఛన్తోనే బతుకుతున్న. గిప్పుడేమో మోదీ అంట గ్యాస్కు పైసల్ పెంచి బండ మోపిండు. నా పింఛన్ సొమ్మంతా గ్యాస్కే పోతయ్. ఇగ నేనెట్లా బతకాలి. ఏం తినాలి. గందుకనే మా ఊళ్లో లొల్లిజేత్తే అక్కడకు పోయిన. నా కట్టం తెలవాలని నేను కూడా దారిపై అందరితో కూసున్న. ఇగ సిలిండర్ కొనలేను. అడవికిపోయి కట్టెలు తెచ్చుకొని వంట జేసుకుంట.
ఇచ్చోడ, మార్చి 2 : కేంద్ర ప్రభుత్వం తరచూ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నది. సామాన్యులు గ్యాస్ సిలిండర్ కొనే పరిస్థితి లేదు. ఇకపై కట్టెల పొయ్యే దిక్కయ్యేలా ఉంది. మరో వైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ వంటి నిత్యావసరాల ధరలను పెంచుతున్నది. పేద, మధ్య తరగతి కుటుంబాల జీవితాలను దుర్భరంగా చేస్తున్నది. బీజేపీని ఓడిస్తేనే ధరలకు కళ్లెం పడ్తది.
-ఆడె చంగుబాయి, సర్పంచ్ మండబొగ్డ, బోథ్
ఇచ్చోడ, మార్చి 2 : మంచి రోజులు వస్తయంటే ఏందో అనుకున్న. కేంద్ర సర్కారు పుణ్యమా అని మాకు మాళ్లా కట్టెల పొయ్యే దిక్కైంది. బీజేపీ సర్కారు వచ్చినప్పటి నుంచి రూ.400 నుంచి రూ.1200 వరకు పెంచిన్రు. ఇలా గ్యాస్ ధరలు పెరగడం చూస్తుంటే గ్యాసంటే భయమయ్యే పరిస్థితి వస్తుంది. మోదీ సర్కారు వచ్చినప్పటి నుంచి పేద ప్రజల కష్టాలు మొదలైనయ్.
– రాథోడ్ మచ్చబాయి, గృహిణి, మండబొగ్డ, బోథ్
భీమారం, మార్చి 2 : మోదీ పాలనలో పేదలు బతుకుడు కష్టమే. ఇప్పటికే ఈ పన్ను.. ఆ పన్ను అంటూ అందినకాడికి దండుకుంటున్నరు. ఇగ గ్యాస్ ధర అయితే ఎప్పుడు పెరుగుతదో అర్థమైత లేదు. ఇష్టం వచ్చినట్లు పెంచుకుంట పోతున్నరు. మళ్లా రూ. 50 పెంచారు. ఏవి కొందామన్న మండిపోతున్నయ్. పూట గడవడమే కష్టంగా ఉందంటే.. కేంద్రం ఇట్లా ధరలు పెంచి మా బతుకులను ఆగం చేస్తున్నది.
– దాసరి కళావతి, భీమారం
సారంగాపూర్, మార్చి 2 : కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరలు పెంచి గరీబోళ్ల బతుకులతో ఆటలాడుతున్నది. ఒక్కో సిలిండర్పై రూ.50 పెంచి, నడ్డి విరుస్తున్నది. మేం కూలీ నాలీ చేసుకొని బతికెటోళ్లం. గిట్ల ఊకూకే ధరలు పెంచితే మా బతుకులు ఎట్ల సాగాలె. ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని నేను ఇన్ని రోజుల నుండి చూడలే. కేసీఆర్ సార్ మా లాంటి గరీబోల్లకు మంచి మంచి పథకాలు పెట్టి మా బాగోగులు చూసుకుంటున్నారు.
– ద్యావత్ లచ్చవ్వ