కుభీర్ : ఋతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకధాటిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కుభీర్ తహసీల్దార్ శివరాజ్ ( Tehsildar Shivaraj) మండల ప్రజలకు సూచించారు. ఫోన్లో మండంలోని గ్రామ రెవెన్యూ అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ( Teleconference ) మాట్లాడారు.
కుభీర్తో పాటు పలు గ్రామాలను సందర్శించి గ్రామ రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. మట్టితో కట్టిన ఇండ్లు, పాత నివాసాల్లో ఉన్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. చెరువుల్లోకి చేపలు పట్టేందుకు వెళ్లనీయవద్దని, పశువులను మేపేందుకు వెళ్లకుండా గ్రామంలో దండోరా లేదా మైకుల ద్వారా అనౌన్స్ చేయించాలని సూచించారు.
ఇనుప విద్యుత్ స్తంభాలను తాకకుండా జాగ్రత్త పడే విధంగా అప్రమత్తం చేయాలన్నారు. గ్రామాల్లోని వర్షాల వల్ల కలిగే నష్టాలను ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిందిగా ఆదేశించారు. రానున్న రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.