ఆదిలాబాద్, మే 18(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. మండుటెండను లెక్క చేయకుండా ప్రజావాణికి వచ్చి దరఖాస్తులు అందజేశారు. దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయించు కోవడానికి క్యూ కట్టారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, ఇతర సమస్యలపై దరఖాస్తులు అందించారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు పరిశీలించిన అధికారులు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కూలీరేట్లు పెంచాలి ..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీడబ్ల్యూసీ గోదాముల్లో అన్లోడింగ్ హమాలీ చార్జీలు పెంచాలంటూ కూలీలు ప్రజావాణిలో కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చారు. మార్క్ఫెడ్ గోదాములు, ప్రైవేటులో హమాలీ ఛార్జీలు సంచికి రూ.8.50 చెల్లిస్తున్నారని, సీడబ్ల్యూసీ గోదాముల్లో కేవలం రూ.3.20 చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఈ గోదాముల్లో అన్లోడింగ్ చేయడానికి 54 మంది కూలీలు ఉన్నారని, తక్కువ ఛార్జీలు చెల్లించడం వల్ల తాము నష్టపోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పంటల సీజన్ కొనసాగుతున్న దని, జిల్లాలోని వివిధ మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన మక్క, జొన్న పంటల వందలాది సంచులను గోదాముల్లో అన్లోడింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇతర హమాలీలతో సమానంగా తమకు కూలీ రెట్లు పెంచాలని వారు కోరారు.