పెంబి, ఏప్రిల్ 6: ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన సేవలు అందుతున్నాయని, హాస్పిటళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించడానికి సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ. 1.56 కోట్లతో అదనపు గదుల నిర్మాణానికి గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అంధత్వ నివారణకు కంటి వెలుగు, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడానికి కేసీఆర్ కిట్, కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కార్పొరేట్కు దీటుగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. అంతకుముందు మందపల్లిలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల లక్ష్మి-శంకర్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, సర్పంచ్లు పూర్ణచందర్ గౌడ్, సుధాకర్, మహేందర్, తానాజీ, రాజు, నాయకులు కున్సోత్ విలాస్, విక్రమ్నాయక్ పాల్గొన్నారు.
ఖానాపూర్ రూరల్, ఏప్రిల్ 6 : హనుమాన్ జయంతి సందర్భంగా మండలంలోని గొసంపల్లె హనుమాన్ ఆలయంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే రేఖానాయక్ నాయకులతో కలిసి హాజరయ్యారు. పూజల అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. వేడుకలకు గాను రూ. 30 వేలు విరాళం అందించారు. కార్యక్రమంలో సత్తనపల్లి పీఏసీఎస్ చైర్మన్ అమంద శ్రీనివాస్, సర్పంచ్ టేకు గంగారాం, ఉప సర్పంచ్ నామెడ కృష్ణవేణి ధర్మరాజు, గాంధీ, కొప్పుల రాజేశ్వర్, శోభన్బాబు, బొడిగె సంతోష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 6: మండలంలోని శ్యాంనాయక్ తండాలో జగదాంబ, సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రేఖానాయక్ గురువారం భూమిపూజ చేశారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా రూ. 5 లక్షలు లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ధర్మనాయక్, ఎంపీపీ పంద్ర జైవంత్రావు, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరాం, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, ఎంపీటీసీ మోహన్ నాయక్, బంజారా యువసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కపిల్ కుమార్ జాదవ్, హరిచంద్, శ్రీనివాస్, రాజ్కుమార్, దేవ్రావు, తుకారాం ఉన్నారు