మంచిర్యాల, మార్చి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పెద్దపల్లి ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ నుంచి అనేక మంది పోటీ పడగా, చివరకు గడ్డం వెంకటస్వామి (కాక) మనవడు, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీకి కేటాయించడంపై ఆ పార్టీలో గందరగోళం నెలకొంటుంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలతో పాటు, కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు, ముఖ్యంగా మాదిగ సామాజికవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మాదిగలను విస్మరిస్తుందంటూ పెద్దపల్లిలో శుక్రవారం దళిత ఐక్యవేదిక నాయకులు ప్రెస్మీట్ పెట్టారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో స్వతంత్య్ర అభ్యర్థిగా ఓ మాదిగను నిలబెడుతామని, త్వరలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామంటూ హెచ్చరించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మూడు లక్షల మంది మాదిగ సామాజిక వర్గ ఓటర్లున్నారని, అంతా ముక్తకంఠంతో గడ్డం వంశీకి ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాంటూ చెప్పారు. వంశీకి పెద్దపల్లి టికెట్ ప్రకటించిన మరుసటి రోజే మాదిగ సామాజిక వర్గం షాక్ ఇవ్వడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో గడ్డం ఫ్యామిలీ ఉన్నట్లు తెలుస్తున్నది. పెద్దపల్లి జిల్లాలో మాదిగ సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని ఆ సామాజిక వర్గం గడ్డం ఫ్యామిలీకి సహకరించడంపై సందేహాలు నెలకొన్నాయి.
వంశీకి టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు సైతం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించమని చెబుతూనే.. ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి.. ఇప్పుడు ఎంపీ టికెట్ సైతం ఇవ్వడమేమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లిలో ఎంపీలుగా కాక ఫ్యామిలీ తప్ప.. వేరే వాళ్లు ఎవ్వరూ ఉండకూడదా అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్లో తీవ్రంగా సాగుతున్నట్లు తెలుస్తున్నది. అసలు ఆ కుటుంబ సభ్యులను ఎన్నిసార్లు గెలిపించినా పార్లమెంట్ పరిధిలో చేసిందేమీ లేదని, అలాంటోళ్ల చేతుల్లోనే మళ్లీ ఎంపీ టికెట్ పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అని టికెట్ ఆశించిన నాయకులు బాహాటంగానే మాట్లాడుతున్నట్లు తెలిసింది.
ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడి, టికెట్ వస్తుందని ఖర్చు పెట్టుకుంటే.. మొన్నీమధ్యే పార్టీలోకి వచ్చిన ఆ కుటుంబానికి టికెట్ ఇవ్వడం ఏమిటని నిట్టూరుస్తున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్లోని ఇతర సీనియర్లు కూడా గడ్డం వంశీకి సపోర్ట్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. మంత్రి శ్రీధర్బాబు కొందరు ఎమ్మెల్యేలు ఈ మధ్యనే ఢిల్లీకి వెళ్లి మరీ మాజీ ఎంపీ సుగుణకుమారికి టికెట్ ఇవ్వాలని ఫైరవీలు చేశారు. దీంతో ఇప్పుడు వారంతా ఎంత వరకు వంశీ కోసం పని చేస్తారనేది ప్రశ్నార్థకంగానే మారింది. మంత్రి సపోర్ట్ లేకుండా ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే పీఎస్సార్ వంశీకి సపోర్ట్ చేసేలా లేరు.
అటు మంత్రితో పాటు ఇటు ముందు నుంచి పార్టీనే పట్టుకొని పని చేసిన పీఎస్సార్లాంటి ఎమ్మెల్యేలకు ఇది ఎంత వరకు రుచిస్తుందో చూడాలి. అంతా కలిసి కష్టపడి గెలిపించినా గడ్డం ఫ్యామిలీనే ఆ క్రెడిట్ కొట్టేస్తుందని.. మంత్రి పదవి కూడా డిమాండ్ చేస్తుందని.. అదే జరిగితే తామంతా ఆ కుటుంబం చేతిలో పావులుగా మారాల్సిందేనని అంతా భావిస్తున్నారంట. అదే నిజమైతే పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో గడ్డం సోదరులు ఎమ్మెల్యేలుగా ఉన్న బెల్లంపల్లి, చెన్నూర్లో తప్ప మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సహకరించేలా లేరనే చర్చ జోరుగా సాగుతున్నది.