తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘పట్టణ ప్రగతి దినోత్సవం’ అంబరాన్నంటింది. పారిశుధ్య కార్మికులు, సిబ్బంది బతుకమ్మ, బోనాలతో డప్పు చప్పుళ్ల నడుమ భారీ ర్యాలీలు తీయగా, ప్రధాన వీధుల్లో సందడి కనిపించింది. మానవహారంగా ఏర్పడి నినాదాలతో హోరెత్తించారు. పలుచోట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొని, జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వరాష్ట్రంలో బల్దియాలు సాధించిన అభివృద్ధి గురించి వివరించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, ఉత్తమ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, బ్యాంకర్లను సన్మానించారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థినులు, కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు.
నిర్మల్ అర్బన్, జూన్ 16: రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రగతి వేడుకలు పండుగలా నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్లో జరిగిన సంబురాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పట్టణంలో స్వయం సహాయక సంఘాలకు రూ. 6.20 కోట్ల చెక్కును అందజేశారు. పారిశుధ్య కార్మికులకు అసవరమైన కిట్ను పంపిణీ చేశారు. బల్దియాలో ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. స్వరాష్ట్రంలో పల్లెలతో పాటు పట్టణాల రూపురేఖలు గణనీయంగా మారాయని పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు వివరించారు. జిల్లాలో కొత్తగా ఖానాపూర్ మున్సిపాలిటీని ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు.
భైంసాటౌన్, జూన్ 16 : భైంసా మున్సిపల్ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయం నుంచి కిసాన్ గల్లీలోని పాత మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొని పట్టణ అభివృద్ధిపై మాట్లాడారు. ప్రతిభ చూపిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. వడ్డీమాఫీ రూ. 2 కోట్ల చెక్కును మహిళా సంఘాలకు అందజేశారు. పట్టణ అభివృద్ధి నివేదికను మున్సిపాలిటీ సిబ్బంది చదివి వినిపించారు.
ఖానాపూర్, జూన్ 16: పట్టణంలోని జేకే ఫంక్షన్హాల్లో పట్టణ ప్రగతిని మున్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి పారిశుధ్య వా హనాలతో కార్మికులు, సిబ్బంది భారీ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే రేఖానాయక్ జ్యోతి ప్ర జ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలో జరిగిన అభివృద్ధిని వివరించి, ఉత్తమ సేవలందించిన పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలందించారు.
ఎదులాపురం, జూన్ 16: మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి దినోత్సవాన్ని స్థానిక డైట్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. అనంతరం పట్టణంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. పారిశుధ్య కార్మికులను ప్రశంసాపత్రం, శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.