ట్రయల్ రన్ సక్సెస్.. పరిశీలనకు శాంపిళ్లు
త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు
గంటకు వెయ్యి లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం
300 బెడ్లకు అందించేలా ఏర్పాట్లు
నిరుపేదలకు ప్రయోజనం
ఆదిలాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనాలాంటి విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపడుతున్నది. ఈ మేరకు ఆదిలాబాద్లోని రిమ్స్లో గంటకు వెయ్యి లీటర్ల ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఇటీవల ట్రయల్ రన్ సక్సెస్ కాగా, శాంపిళ్లను పరిశీలనకోసం పంపించింది. త్వరలోనే దీనిని ప్రారంభించే అవకాశముండగా, దవాఖానలోని 300 బెడ్లకు ప్రాణవాయువు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసింది. ఇది అందుబాటులోకి వస్తే ఉమ్మడి జిల్లాలోని నిరుపేదలకు ప్రయోజనం చేకూరుతుందని డైరెక్టర్ కరుణాకర్ చెబుతున్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అంది స్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనుమా నితులకు ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేయడంతో పాటు జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిం చింది. వివిధ ప్రాంతాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి చికిత్స చేశారు. ఆదిలాబాద్ రిమ్స్తో పాటు మంచిర్యాల, నిర్మల్ ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేక వార్డుల్లో ఆక్సిజన్ సౌకర్యం కల్పించి కొవిడ్ బాధితులు వైరస్ నుంచి కోలుకునేలా చేశారు. రెండో దశలో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకాగా, చికిత్సలో భాగంగా ఆక్సిజన్ అత్యవసరమైంది. ఇతర రాష్ర్టాల నుంచి ఆక్సిజన్ తెప్పించి చికిత్సలో ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంది. ఆదిలాబాద్ రిమ్స్లో 6 వేల లీటర్ల ఆక్సిజన్ నిల్వచేసే సౌకర్యం ఉండగా, ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్ తీసుకువచ్చి కొరత లేకుండా చర్యలు చేపట్టింది.
రిమ్స్లో ఆక్సిజన్ ప్లాంట్ పూర్తి
కరోనాలాంటి విపత్కర పరిస్థితులతో పాటు ప్రజలకు అత్యవసర సమయాల్లో వైద్యం అందించడానికి ఆక్సిజన్ అవసరమవుతుంది. ఆదిలాబాద్ రిమ్స్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది మే నెలలో ప్లాంట్ పనులు ప్రారంభించగా, ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఆక్సిజన్ తయారీకి సిద్ధమైంది. ప్లాంట్లోని పరికరాలు గాలిలోని ఆక్సిజన్ తీసుకుని నిల్వ చేసుకుంటాయి. గంటకు వేయి లీటర్ల ప్రాణవాయు వును తయారు చేసే విధంగా ప్లాంట్ను ఏర్పాటు చేశారు. దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ అందించడానికి పైప్లైన్తో పాటు విద్యుత్, జనరేటర్, ఇతర పరికరాలను బిగించారు. దవాఖానలో 300 బెడ్లకు ఆక్సిజన్ అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇటీవల నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. ప్లాంట్లో తయారైన ఆక్సిజన్ శాంపిళ్లను పరిశీలన కోసం పంపినట్లు రిమ్స్ వైద్యులు తెలిపారు. శాంపిళ్ల ఫలితాలు వచ్చిన తర్వాత ప్లాంట్ను ప్రారంభిస్తామన్నారు.
ట్రయల్ రన్ నిర్వహించాం
రిమ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్కు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ట్రయల్ రన్ సైతం విజయవంతమైంది. ప్లాంట్ నుంచి వచ్చిన శాంపిళ్లను పరిశీలనకు పంపించాం. ఫలితాలు అనుకూలంగా వచ్చిన తర్వాత ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సరఫరా ప్రారంభిస్తాం. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు వల్ల పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుతాయి.