ఇచ్చోడ, మార్చి 22 : సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గిరిజన ఆశ్రమోన్నత బాలికల పాఠశాలలో కిచెన్ గార్డెన్ నిర్వహిస్తున్నారు. పాఠశాల ఆవరణలో సేంద్రియ విధానంతో కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నారు. ఈ స్కూల్లో 4 నుంచి 9 వతరగతి వరకు 263 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు కే ఉత్తమ్తో పాటు ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు తమకు అవసరమైన కూరగాయలను ప్రత్యేకంగా పండిస్తున్నారు. సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరలతో ప్రతి రోజూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.
ఉపాధ్యాయులు,విద్యార్థులు కలిసి కట్టుగా..
విద్యార్థులు,ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసికట్టుగా కిచెన్ గార్డెన్ నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 30 నిమిషాలు పాఠశాల సమయానికంటే ముందుగా, తరగతులు ముగిసిన తర్వాత మరో 30 నిమిషాల పాటు కిచెన్ గార్డెన్లో కలుపు తీత, మొక్కలకు నీళ్లు పెట్టడం, వాటిని పరిరక్షణలో నిమగ్నమవుతున్నారు. ముక్రా (కే) నుంచి సేంద్రియ ఎరువులు తీసుకవస్తున్నారు. దీంతో విద్యార్థులకు పంటలు ఎలా పండిస్తారనే అవగాహనతోపాటు పనిపై గౌరవం పెరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
సాగు చేస్తున్న కూరగాయలు
వంకాయ 300 మొక్కలు, టమాటా 300 , బెండకాయ 200, పాలకూర, పచ్చి మిర్చి 200 మొక్కలు నాటారు. 40 జామ మొక్కలను మూడేళ్ల కింద నాటగా, ఈ ఏడాది నుంచి కాయలు కాస్తున్నాయి. ప్రాథమికోన్నత పాఠశాల ఎకరా విస్తీర్ణంలో ఉంది. స్కూల్ ఆవరణ స్థలంలో గత అక్టోబర్లో పలు రకాల కూరగాయల విత్తనాలు నాటారు. నవంబర్ 30 నుంచి కోత మొదలైంది. అప్పటి నుంచి పాఠశాలలోని విద్యార్థులకు ఆ కాయగూరలనే మధ్యాహ్న భోజనంలో ఆహారంగా అందిస్తున్నారు. తాజా కాయగూరలతో రోజుకో రకం వంటకాన్ని అందిస్తున్నారు. ఎలాంటి పురుగుల మందులు వినియోగించకుండా కేవలం సేంద్రియ ఎరువుల ద్వారానే సాగు చేస్తుండడంతో విద్యార్థులు పౌష్టికాహారం అందుతున్నది. సంపూర్ణ ఆరోగ్యం అందించే తాజా కూరగాయలతో మధ్యాహ్న భోజనం అందించడంపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ అభినందనలు
పాఠశాలలో విద్యార్థులు,ఉపాధ్యాయులు కూరగాయలు,పండ్లు పండించడంతో మంత్రి కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో ఫొటో పోస్టు చేశారు. పిల్లలకు విద్యతో పాటు ఆహారాన్ని ఎలా పండించాలో నేర్పించడంపై ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు. అలాగే ఐటీడీఏ పీవో,డీడీ ఉన్నతాధికారులు అభినందించారు
పౌష్టికాహారం అందించడమే లక్ష్యం
విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ను ఏర్పాటు చేశాం. ప్రతి రోజు బడిలో పండించిన కూరగాయలతోనే మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు చదువుతో పాటు పంటలు పండించే పద్ధతులను సాయంత్రం, ఉదయం నేర్పిస్తున్నాం. సేంద్రియ ఎరువుతోనే పంటలు పండిస్తున్నాం. ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం సంతోషంగా ఉంది.
-ఉత్తమ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ,ఇచ్చోడ