ఉట్నూర్, మే 26 : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో పని చేస్తున్న 14 కళాశాలలను విభజిస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. దీంతో గిరిజన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గిరిజనులు విద్యకు దూరమవుతున్నారని, పాఠశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు మళ్లీ కళాశాలలో చేరకుండా ఉండే అవకాశాలు ఏర్పడతాయని వారు పేర్కొంటున్నారు. అదే పాఠశాలలో కళాశాలలు విలీనమై ఉంటే ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసిస్తారని తెలుపుతున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలోనే కొనసాగించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవోకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.
ట్రైబల్ గురుకుల పాఠశాలలను ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు నిర్వహించేవారు. ఇప్పుడు అప్గ్రేడ్ పేరిట ఇంటర్ కళాశాలలను వేరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు రావడంతో ఈ విద్యాసంవత్సరం నుంచే అమలుకానున్నది. ఇప్పటి వరకు రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీ విభాగాలను వేర్వేరు సంస్థలుగా విభజించారు. దీంతో ఇంటర్మీడియట్ సెక్షన్ ఇకపై స్వతంత్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలుగా కొనసాగనున్నాయి. ఈ విభజనతో విద్యా నాణ్యత పెరుగుతుందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు నీట్, జేఈఈ, ఎంసెట్ కోచింగ్ ఇవ్వడానికి దోహద పడతాయని, ల్యాబ్, లైబ్రరీ, వసతులు పెరిగేందుకు అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
గిరిజన విద్యార్థులు అసలే ఉన్నత విద్యకు దూరంగా ఉంటారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో కనీసం ఒక యూనివర్సిటీ కూడా లేదు. గిరిజన రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకప్పుడు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కొనసాగుతుండేవి. దీంతో విద్యార్థులకు ఒకసారి అడ్మిషన్ చేస్తే ఇంటర్ వరకు అక్కడే చదివేవారు. ఇప్పడు ప్రభుత్వం వాటిని అప్గ్రేడెడ్ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలల పేరిట వేరు చేసింది. దీంతో పదో తరగతి చదవగానే ఇంటికి వెళ్లిపోయిన విద్యార్థి మళ్లీ ఇంటర్కు రాకపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కావున వాటిని అలాగే కొనసాగిస్తే బాగుండేవి. డ్రాపౌట్లు తగ్గేవి. అయిన ప్రభుత్వం పాఠశాలలోనే ఇంటర్ కళాశాలను విలీనం చేస్తానని చెప్పి ఇప్పుడు ఉన్న వాటిని విభజించడం ఏంటీ? గిరిజన విద్యావ్యవస్థ కుంటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై పీవోకు వినతిపత్రం సమర్పించాం.
-పెందూర్ దాదిరావు, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్.