ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 1 : విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం నిధులు వెచ్చిస్తూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కింద పట్టణంలోని హమీద్పుర, విద్యానగర్, కానాపూర్ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తవగా, పాఠశాలలను అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడుతలో 237 పాఠశాలల్లో మరమ్మతులు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీ తదితర పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. హమీద్పుర ఉర్దూ మీడియం పాఠశాలను రూ.20.27 లక్షలు.., విద్యానగర్ పాఠశాలను రూ.20.63 లక్షలు.., ఖానాపూర్ (ఉర్దూ మీడియం) పాఠశాలను 17.39 లక్షలతో సివిల్ వర్క్ పనులు పూర్తి చేసుకొని రంగులు, డ్యూయల్ డెస్క్లు, గ్రీన్ చాక్ బోర్డులను సమకూర్చినట్లు వెల్లడించారు. పాఠశాలల మేనేజ్మెంట్లు నిర్వహణ తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు.
అనంతరం అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. 20 ఏండ్ల క్రితం నిర్మించిన పాఠశాల భవనాలను మరమ్మతులు, ఇతర సౌకర్యాలు కల్పించి ఒకేసారి పనులు పూర్తి చేసుకొని పాఠశాలలను వినియోగింలోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ప్రతి విద్యార్థీ నిత్యం పాఠశాలకు హాజరవ్వాలని సూచించారు. ఆ తర్వాత డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నదని, గురుకులాలు నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కలెక్టర్ బదిలీ జిల్లా ప్రజలకు బాధ కలిగినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు కలెక్టర్ సేవలను గుర్తుంచుకుంటారని, మున్ముందు మంచి ఉన్నత స్థానాలను అధిష్టించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, మున్సిపల్ కమిషనర్ శైలజ, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, డీఈవో ప్రణీత, సెక్టోరల్ అధికారులు నారాయణ, నర్సయ్య, ఉదయ శ్రీ, వార్డు కౌన్సిలర్లు ప్రకాశ్, కలాల శ్రీనివాస్, విజయ్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.