ఎదులాపురం, మార్చి3: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లు, వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం శనగల కొనుగోళ్లను ప్రారంభించారు. అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్తో కలసి తూకం యంత్రాలకు పూజలు చేశారు. శనగలు విక్రయించేందుకు వచ్చిన తొలి రైతును సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కాగా క్వింటాలుకు రూ.5335 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. 1.52 లక్షల ఎకరాల్లో 8 లక్షల క్వింటాళ్లు పండినట్లు అంచనా వేశారని పేర్కొన్నారు. ఇందులో కేవలం 25 శాతం మాత్రమే కొనగోలు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని, మిగిలిన 75 శాతం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయనుందని స్పష్టం చేశారు. కేంద్రం పరిధిలోని అనేక రైతు సంక్షేమ పథకాలను బీజేపీ ప్రభుత్వం స్వస్తి పలికిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నదన్నారు. కార్యక్రమలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుమ్ర విజయలక్ష్మి, వైస్ చైర్మన్ బొమ్మకంటి రమేశ్, ఏడీ శ్రీనివాస్, కార్యదర్శి ఎం వెంకన్న, డైరెక్టర్లు పురుషోత్తం, రాథోడ్ ప్రకాశ్, ఎస్కే రవూఫ్, అల్లంకొండ గంగాధర్, పీ మల్లేశ్, మహేందర్, రామచంద్రారెడ్డి, రాథోడ్ ఉత్తం, కుమ్ర లలిత, జే అశోక్, ఎల్టీ శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సాయిని రవికుమార్, మెట్టు ప్రహ్లాద్ తదితరులు ఉన్నారు.
ప్రతి గింజనూ కొనుగొలు చేస్తాం
ఎదులాపురం (జైనథ్), మార్చి3: రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మార్కెట్యార్డులో శనగ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. లాటరీ పద్ధతిన గ్రామాల వారీగా కొనుగొలు తేదీలను ఖరారు చేశారు. కేంద్రం ఎరువులపై సబ్సిడీ కూడా ఎత్తివేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, మార్కెట్ చైర్మన్ గోడం వర్ష సునీల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి , రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్లు బాలూరి గోవర్ధన్ రెడ్డి, రోకండ్ల రమేశ్, వెంకట్ రెడ్డి, గణేశ్ యాదవ్, సర్పంచ్లు దేవన్న, జగదీశ్ రెడ్డి, మార్కెట్ కార్యదర్శి మధుకర్ ఉన్నారు.
నార్నూర్లో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
నార్నూర్,మార్చి3: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. నార్నూర్ ఉప మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ సహకారంతో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ చైర్మన్ ప్రారంభించారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎంపీపీ కనన మోతుబాయి, ఇంద్రవెల్లి మార్కె ట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్, సహకార సంఘం చైర్మన్ ఆడే సురేశ్, సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెస్రం హన్మంత్రావు, డైరెక్టర్ దుర్గే కాంతారావు, వ్యవసాయ అధికారి గిత్తే రమేశ్, సిబ్బంది ఉన్నారు.