టీఆర్ఎస్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్గా మరొకరు
ఇక గులాబీ పార్టీ గెలుపు లాంఛనమే
ఆ పార్టీకే 80 శాతం మంది స్థానిక ప్రజాప్రతినిధులు
వచ్చే నెల 10న పోలింగ్
ఆదిలాబాద్, నవంబర్ 26( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారంతో గడువు ముగియగా, బరిలో ఇద్దరే మిగిలారు. మొత్తం 24 మంది నామినేషన్లు వేయగా, 22 మంది విత్ డ్రా చేసుకు న్నారు. ఇందులో టీఆర్ఎస్ నుంచి ఒకరు.. ఇండిపెండెం ట్గా మరొకరు పోటీలో నిలిచారు. కాగా, ఉమ్మడి జిల్లాలో 80 శాతం మంది స్థానిక ప్రజాప్రతినిధులు గులాబీ పార్టీకే చెందిన వారు కావడంతో, ఆ పార్టీ అభ్యర్థి దండె విఠల్ గెలుపు లాంఛనమేనని అంతా భావిస్తున్నారు.
ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు లాంఛనమేనని అంతా భావిస్తున్నారు. శుక్రవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా, టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్, ఇండిపెండెంట్ అభ్యర్థి పెందూర్ పుష్పారాణి బరిలో నిలిచారు. ఎమ్మెల్సీ స్థానానికి 24 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఉపసంహరణకు గురు, శుక్ర రెండ్రోజులు సమయం ఉండడంతో మొదటి రోజు ఆరుగురు అభ్యర్థులు జేక శేఖర్, రియాజొద్దీన్, కట్టా శ్యాంసుందర్, అబ్దుల్ రజాక్, గాజుల గంగాధర్, హరిణి బరిలో నుంచి తప్పుకున్నారు. రెండో రోజు శుక్రవారం మీర్జా జిలానీబేగ్, శ్యాంరావు, శ్రీనివాసరెడ్డి, ఎండీ. సోహెల్ ఆహ్మద్, మచ్చపోశవ్య, పొదిల గణేశ్, ముండే శారద, చిలుకూరి రమేశ్ రెడ్డి, గోప సాయిగౌడ్, గడ్డం త్రిమూర్తి, జాబు కాంతారావు, మామయి రమేశ్, కలాల శ్రీనివాస్, గాజుల నారాయణ రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఉగ్గె సత్యనారాయణ తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
భారీ మెజార్టీతో విజయం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారు. ఈ ఎన్నికల్లో 937 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీ కౌన్సిలర్లు 308, జడ్పీటీసీలు 65, ఎంపీటీసీలు 554, ఎక్స్ అఫిషియో సభ్యులు 10 మంది ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్కు చెందిన వారే 80 శాతం వరకు ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని శ్రేణులు భావిస్తున్నాయి. డిసెంబర్ 10న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 కేంద్రాల్లో, పోలింగ్ జరుగనుండగా 14న ఓట్ల లెక్కింపు జరుగనుంది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు భారీ మెజార్టీని సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు.