ఎదులాపురం, మార్చి 19 : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డీపీఆర్వో కార్యాలయంలో మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్(ఎంసీఎంసీ)ను మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలంతో కలిసి ప్రారంభించారు. ఈ మేరకు ఎంసీఎంసీలో ఏర్పాటు చేసిన టీవీలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల సమాచారాన్ని మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు డీపీఆర్వో ద్వారా అందిస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో ఎంసీఎంసీ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, పత్రికల్లో ప్రచురించిన రాజకీయ ప్రకటనలను అభ్యర్థి ఎన్నికల వ్యయంలో నమోదు చేస్తామని పేర్కొన్నారు. శాటిలైట్ ఛానల్, కేబుల్ నెట్వర్క్, సోషల్ మీడియా, ఈ-పేపర్లో ప్రకటనలు, బల్క్ ఎస్ఎంఎస్, వాయిస్ మెస్సేజ్లు, ఇతర ఆడియో-వీడియో విజువల్ మీడియాలు, రాజకీయ ప్రకటనలను ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాతనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ వికాస్ మహతో, డీపీఆర్వో తిరుమల, ఈడీఎం రవీందర్, తదితరులు పాల్గొన్నారు.