జన్నారం, మార్చి 21 : అడవులతోనే మానవ మనుగడ సాధ్యమవుతున్నదని అటవీ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా జన్నారం, ఇందన్పెల్లి రేంజ్ ఆఫీసర్లు లక్ష్మీనారాయణ, హఫిసొద్దీన్ ఆధ్వర్యంలో అడవుల ప్రాముఖ్యతపై విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించడంతో పాటుగా శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించి అడవుల్లోని చెత్తను తొలగించారు. అడవుల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యక్షంగా తెలిపారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి ర్యాలీ తీశారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెండు ఫారెస్ట్ రేంజ్ల అటవీశాఖ సిబ్బంది, బేస్క్యాంప్ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
హాజీపూర్, మార్చి 21 : అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని క్వారీ ప్రాంతంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని అటవీశాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ సెక్షన్ అధికారి హతవుల్లా మాట్లాడుతూ క్వారీ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ప్లాస్టిక్ కవర్లు, సీసాలు, ఇతర వస్తువులు తీసుకురావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ అహ్మద్, విజయ్, బీట్ ఆఫీసర్లు ఉషారాణి, తిరుపతి, సంతోష్, రత్న సింధు, శ్రీను, కవిత, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్, మార్చి 21: చెన్నూర్ మండలంలోని కిష్టంపేట అర్బన్ పార్క్లో చెన్నూర్లోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఎండీవో రమేశ్, చెన్నూర్ ఎఫ్ఆర్వో శివకుమార్, ఎఫ్ఎస్వో జావీద్, ఎఫ్బీవో రాజేందర్ సిబ్బంది పాల్గొన్నారు.
కోటపల్లి, మార్చి 21 : అటవీ సంరక్షణపై కోటపల్లి రేంజర్ రవి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు.అడవులతో ప్రయోజనాలు, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అడవుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. కోటపల్లి ఆశ్రమ పాఠశాలలో వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించి విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ లావణ్య, ఆశ్రమ పాఠశాల హెచ్ఎం లావణ్య, వార్డెన్ సుమలత, ఎఫ్ఎస్వో రాములు, రాందాస్, ఎఫ్బీవోలు సాగర్, సత్యనారాయణ, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
జైపూర్, మార్చి 21: మండలంలోని శివ్వారం మొసళ్లకేంద్రం వద్ద అటవీ అధికారులు అంతర్జాతీయ అటవీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. చెన్నూర్లోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడకు రాగా మొసళ్ల కేంద్రం యొక్క ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. ఈ ప్రాంతాన్ని విద్యార్థులకు చూపించి అనంతరం మొసళ్ల కేంద్రం యొక్క ప్రాముఖ్యతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ అటవీ డివిజన్ అధికారులు రమేశ్, శివకుమార్, ఎఫ్ఎస్వో బాలకృష్ణ, శ్రీకాంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.