మంచిర్యాల, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక కృత్రిమ కొరత అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. తక్కువ సంఖ్యలో క్వారీలకు అనుమతి ఇవ్వడంతో ఇసుక దొరకడమే బంగారమైపోయింది. ఉమ్మడి జిల్లాలోని.. ఒక్క మంచిర్యాల మినహా మిగిలిన జిల్లాల్లో ఎక్కడా అధికారికంగా క్వారీలకు పర్మిషన్ లేదు. టీఎస్ఎండీసీ పరిధిలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూర్, జైపూర్ మండలం వేలాల క్వారీలతో పాటు స్థానిక సంస్థల పరిధిలో చెన్నూర్ బతుకమ్మ వాగు, నెన్నెలలోని ఖర్జి వాగు, హాజీపూర్ మండలం వేంపల్లి గోదావరి నుంచి ఇసుక తవ్వేందుకు అనుమతులు ఉన్నాయి.
వాస్తవానికి ఈ సీజన్లో కోటపల్లి మండలం బోరంపల్లి, ఎర్రాయిపేట, చెన్నూర్ చింతలపల్లితో పాటు క్వారీ అన్నింటికీ అనుమతులు ఇచ్చేవారు. ఆసిఫాబాద్ జిల్లా దహెగాంలో ఒక రీచ్ నడిచేది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఎక్కడా లేదు. దీంతో ఇసుక కోసం మంచిర్యాల జిల్లాపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తున్నది. దీనికితోడు ఈ సారి క్వారీల సంఖ్య తగ్గించడంతో ఇసుక కోసం జనాలు వేతకాల్సి వస్తున్నది. ఇదే అదునుగా భావించి కొందరు అక్రమార్కులు ట్రాక్టర్లు, లారీలతో ఇసుక అక్రమ రవాణాకు తెగపడుతున్నారు.
పర్మిషన్ ఉన్న క్వారీలతో పాటు అనుమతి లేని ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. టీఎంఎండీసీ అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం కోటపల్లి మండలం కొల్లూర్లో మాత్రమే అనుమతులతో ఇసుక తీయాల్సి ఉంది. కానీ ఎర్రాయిపేట క్వారీలో ప్రతి రోజూ వందల సంఖ్యలో లారీలు ఇసుక తవ్వుకొని వెళ్తున్నాయి. చెన్నూర్ మొదలుకొని.. ఇందారం వరకు గోదావరి పొడవునా ఈ అక్రమ దందా జోరుగా సాగుతున్నది. దీంతో పాటు జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు, పాత మంచిర్యాల, చెన్నూర్లోని సుద్దాల వాగు, భీమారం గొల్లవాగు, వేమనపల్లిలోని నీల్వాయి వాగుల్లో ఎక్కడపడితే అక్కడ.. ట్రాక్టర్లు పెట్టి పగలూ.. రాత్రీ తేడా లేకుండా ఇసుక తోడేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోనూ ఈ దందా నడుస్తున్నది.
నిర్మల్, సారంగాపూర్, సోన్ మండలాల్లో ప్రవహించే స్వర్ణ వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నారు. అలాగే ఖానాపూర్ మండల పరిధిలోని రాజుర, మందపల్లి గ్రామాల మీదుగా వెళ్లే పలికేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా నడుస్తున్నది. ఆసిఫాబాద్లో కుమ్రం భీం ప్రాజెక్టు, ప్రాణహిత ప్రాంతాల్లో ఎక్కడా ఇసుక మేటలు కనిపించినా అక్రమార్కులు వదలకుండా తరలించుకొని వెళ్తున్నారు. ఇలా అక్రమ మార్గంలో తీసుకువచ్చిన ఇసుకను ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ డంపు చేస్తున్నారు. పొలాలు, వ్యవసాయ భూములు, పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల మధ్య ఖాళీ స్థలాల్లో ఇసుక కుప్పులు తెచ్చి పోస్తున్నారు. సీజన్లో తెచ్చిపోసే ఈ ఇసుకను అన్సీజన్లో ఎక్కువ ధరలకు అమ్ముకుంటారు. ఇవన్నీ తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడం కొసమెరుపు.
అనుమతులు లేని ప్రాంతాల నుంచి ఇసుక తరలించుకొని వెళ్లడం ఒకటైతే.. అనుమతులు ఉన్న దగ్గర మామూళ్ల మత్తులో ముగినిపోయిన అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపుతున్నారు. ఒక ట్రిప్పునకు పర్మిషన్ తీసుకొని ఆ చలాన్తో 10 నుంచి 20 ట్రిప్పులు కొడుతున్నారు. స్థానిక సంస్థల పరిధిలో నడిచే ట్రాక్టర్లలో ఈ వ్యవహారం నిత్యకృత్యంగా మారిపోయింది. ఇక లారీల సంగతైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు టీఎస్ఎండీసీ ద్వారా ఆన్లైన్లో జనరేటైన ఒక చలాన్ను పరిశీలించినప్పుడు సాయంత్రం 4 గంటలకు పర్మిషన్ ఇచ్చినట్లు అందులో ఉంది. కానీ 4.10 గంటలకు ఆ లారీ భీమారం మండల కేంద్రం మీదుగా వెళ్తుంది.
10 నిమిషాల్లో ఆ లారీ 26 కిలోమీటర్ల దూరం ఇసుక లోడ్ నింపుకొని, అంత హెవీలోడ్లో ఎలా వచ్చిందనేది అర్థం కాలేదు. అంటే పర్మిషన్ రావడానికంటే ముందే ఇసుక లోడ్ చేసి ఉండాలి.. లేదా చూపిస్తున్న చలాన్ ఫేకైనా అయి ఉండాలి. ఈ ఒక్క ఉదాహరణ చాలు అధికారుల సహకారంతో ఇసుక దందా ఏ రేంజ్లో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అంతా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని పైపైకి చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అధికారుల దందా ఈ తరహాలో కొనసాగుతుండడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఎవరైనా ప్రశ్నించినప్పుడు లేదా పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు హడావుడి చేసి రెండు, మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి వదిలేయడం తప్ప అంతకుమించి అధికారులు చేసేదేం లేదని జనం మండిపడుతున్నారు.
జిల్లాలో ఇసుక అవసరాల కోసం స్థానిక సంస్థల ఆధ్వర్యంలో మూడు క్వారీలను ప్రారంభించాం. అవసరముంటే మరిన్ని పెంచుతాం. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటేనే ఇసుక తరలించేందుకు అనుమతి ఇస్తున్నాం. వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. అనుమతులు లేని ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా విషయం నా దృష్టికి రాలేదు. వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.
– బాలునాయక్, జిల్లా మైనింగ్ అధికారి, మంచిర్యాల