నిర్మల్ అర్బన్, మే 13 : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నిర్మల్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుతామని జిల్లా విద్యాశాఖాధికారి ఆండ్రు రవీందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి 29 వరకు జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,719 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.
ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 48 పరీక్షా కేంద్రాలను సైతం సిద్ధం చేశామన్నారు. వివిద సెట్ల ప్రశ్నపత్రాలు సైతం జిల్లాకు చేరుకున్నాయని, వాటిని భద్రంగా పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు చెప్పారు. పది పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ తీసుకుంటున్న చర్యలు, తదితర విషయాలను డీఈవో రవీందర్రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
డీఈవో : ఈ సంవత్సరం నిర్వహించే పదో తరగతి పరీక్షకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు కలిపి మొత్తం 9,719 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు 6,651 మంది ఉన్నారు. ఇందులో బాలురు 3,060, బాలికలు 3,591 మంది హాజరవుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 9,719 మంది విద్యార్థులకు గాను 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. అన్ని కేంద్రాలు పరీక్షల నిర్వహణకు అనుకూలంగా ఉన్నాయి. 48 మంది చీఫ్ ఎగ్జామినేషన్ అధికారులు, డిపార్ట్మెంటల్ అధికారులు, 600 మంది ఇన్విజిలేటర్లు, పరీక్షా కేంద్రంలో 300 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉంటే అదనపు డిపార్ట్మెంటల్ అధికారులను నియమించాం.ఈ సారి ఉపాధ్యాయుల కొరత ఏమీ లేదు.
రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు పాటిస్తున్నాం. మొత్తం పరీక్షా కేంద్రాలను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించాం. ఇందులో సీ కేటగిరీ సెంటర్లపై ముఖ్యంగా దృష్టి సారించాం. ఈ సెంటర్లలో తపాల కార్యాలయం, పోలీస్ స్టేషన్లు అందుబాటులో లేనందున సిట్టింగ్ స్కాడ్, కస్టోడియన్ను నియమించి చర్యలు చేపట్టాం.
ముఖ్యంగా వేసవిని దృష్టిలో ఉంచుకొని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం, ప్రతి గదిలో ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఏఎన్ఎంలు విధులు నిర్వహించడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాం.
కొవిడ్ తర్వాత విద్యార్థులు రెండు సంవత్సరాల పాటు పరీక్షలకు దూరంగా ఉన్నారు. పాఠశాలల ప్రారంభం నాటి నుంచే మానసికంగా ముందుగానే సిద్ధం చేశాం. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా క్రమశిక్షణతో పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించాం. దానికి దగ్గట్టుగానే సిద్ధమయ్యారు.
విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు మూడు గ్రాండ్ టెస్టులను నిర్వహించాం. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేసి 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి పరీక్షకు సిద్ధం చేశారు.
జిల్లాలో మాస్ కాపీయింగ్ను పూర్తిగా అరికట్టేలా ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే పరీక్షల నిర్వహణపై అధికారులకు నిబంధనల గురించి శిక్షణ ఇచ్చాం. ప్రతి పరీక్షా కేంద్రంలో 144 సెక్షన్ అమలు పర్చనున్నాం. చీఫ్ సూపరింటెండెంట్ పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాం. జిల్లా వ్యాప్తంగా రెండు ఫ్ల్లయింగ్ స్కాడ్ బృందాలు నిత్యం తనిఖీలు నిర్వహిస్తాయి. ఇందులో తహసీల్దార్, ఎస్ఐ స్థాయి అధికారి, విద్యాశాఖ అధికారులుంటారు. జిల్లాలో ఐదు సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించాం.
ఇప్పటికే నిర్మల్ జిల్లాకు సెట్-1 ప్రశ్నపత్రాలు వచ్చాయి. వాటిని భద్రంగా పోలీస్ స్టేషన్లకు తరలించాం.రెండో సెట్ ప్రశ్నపత్రాలు రానున్నాయి. ప్రశ్న పత్రాలు తీసుకెళ్లేటప్పుడు, జవాబు పత్రాలను తరలించేటప్పుడు ఎస్కార్ట్ భద్రత మద్య ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించాం.