మంచిర్యాల, ఫిబ్రవరి1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రం మరోసారి మోసం చేసింది. పార్లమెంట్లో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర డిమాండ్లకు ఎలాంటి ప్రాధాన్యమి వ్వకుండా కేటాయింపులు చేసింది. ఈసారైనా తమకు వరాలు అందుతాయని ఆశగా ఎదురు చూసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకానికి నిరాశే మిగిల్చింది. అనాపైసా ప్రయోజనం చేకూర్చకుండా, ఎప్పటిలాగే కక్షసాధింపు ధోరణిలోనే ముందు కెళ్లింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్మూర్- ఆదిలాబాద్, మంచిర్యాల-ఆదిలాబాద్ రైల్వే లైన్లు, సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపు, ప్రైవేటీకరణ నిర్ణయం రద్దు. నవోదయ పాఠశాల కేటాయింపు, తదితర డిమాండ్లపై ఎలాంటి ప్రకటన చేయకుండానే పద్దును ముగించింది. ఎన్నికలున్న కర్ణాటక రాష్ట్రంపై మాత్రం వరాల జల్లు కురిపించింది. తమకు ఎంతో కొంత మేలు జరుగుతుందని ఎదురు చూస్తున్న అటు రాష్ట్ర, ఇటు అడవుల జిల్లా ప్రజానీకం ఆశలపై నీళ్లు చల్లింది. దీనిపై సర్వత్రా విమర్శలతో పాటు ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ డిమాండ్లకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అనాపైసా కూడా ఇవ్వలేదు. మనకు మేలు చేసే పథకాలు కానీ.. నిధులు వచ్చే ప్రకటనలు కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ చేయలేదు. పోనీ గతంలో రాష్ట్రం నుంచి మన ఎంపీలు చేసిన డిమాండ్లకు బడ్జెట్లో ఏమైనా ఇచ్చారా అంటే అదీ లేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్మూర్- ఆదిలాబాద్ రైల్వే లైన్కు ఈసారీ మోక్షం లభించలేదు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు విషయాన్ని అసలు పట్టించుకోనేలేదు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని దొంగమాటలు చెప్పి పోయిన ప్రధాని మోదీ.. పార్లమెంట్ వేదికగా దానిపై స్పష్టత ఇవ్వలేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంపై ప్రధానికి మోదీకి లేఖ రాసినా.. బొగ్గుబ్లాక్ల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకునే ప్రకటన ఏం చేయలేదు. మంచిర్యాల, బెల్లంపల్లి రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా దానిపైనా కేంద్రం స్పందించలేదు. ఎన్నికలు ఉన్న కర్ణాటక రాష్ర్టానికి మాత్రం రూ.వేల కోట్ల నిధులు కేటాయించింది. కేంద్ర బడ్జెట్తో అటు రాష్ర్టానికి గానీ.. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గానీ అనాపైసా ప్రయోజనం చేకూరలేదు.
రెండు రైల్వే లైన్లు.. ఏ ఒక్కటీ ఇవ్వలే..
ఈసారి రాష్ర్టానికి భారీగా రైల్వే లైన్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేసినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. రాష్ర్టానికి కొత్త లైన్లు ఏం ఇవ్వలేదు. ఆదిలాబాద్-ఆర్మూర్ 136 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ ఆశలు గల్లంతయ్యాయి. సర్వే పూర్తయి ఏళ్లు గడుస్తున్నా మంజూరుకు నోచుకోలేదు. మంచిర్యాల-ఆదిలాబాద్ ఉట్నూరు మీదుగా 160.58 కిలోమీటర్ల లైన్ ప్రపోజల్ను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ రెండు లైన్లు వచ్చి ఉంటే ఉమ్మడి జిల్లా వాసులకు వ్యయప్రయాసలు తప్పేవి. కానీ కేంద్ర వైఖరితో జిల్లా వాసుల ఎదురుచూపులకు ఇంకా తెరపడలేదు. ఆర్మూర్- ఆదిలాబాద్ లైన్ అయితే నిర్మల్ జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. కానీ అది జరక్కపోవడంతో జనాల్లో అసహనం వ్యక్తం అవుతున్నది. ఈ రెండనే కాదు రాష్ట్ర ప్రభుత్వం గతంలో రైల్వేబోర్డుకు సమర్పించిన ప్రతిపాదనల్లో ఏ ఒక్కదాన్ని కేంద్ర ప్రభుత్వం అసలు పరిగణలోకే తీసుకోలేదు. ఇకపోతే మంచిర్యాల, బెల్లంపల్లి రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ మరుగునపడిపోయింది.
నవోదయ పాఠశాలలు నిల్..
నవోదయ పాఠశాలల మంజూరులో రాష్ర్టానికి మరోసారి కేంద్రం మొండి చేయి చూపించింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాలల్లో నవోదయ పాఠశాలలు కావాలని గతంలో మన ఎంపీ వెంకటేశ్నేత కోరారు. గత సమావేశాల్లోనూ ఈ అంశాన్ని బలంగా ప్రస్తావించారు. కానీ ఈ సారి బడ్జెట్లో నవోదయ పాఠశాలల ప్రస్తావనే ఎక్కడా కనిపించలేదు. సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాలైన మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్లో పాఠశాలల అవసరం ఎంతో ఉంది. ఇందుకు సంబంధించి అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేటాయిస్తామని చెప్పినా కేంద్రం మాత్రం స్పందించలేదు. ఎన్హెచ్-44 హైదరాబాద్ నుంచి నాగపూర్ పారిశ్రామిక కారిడార్ పెండింగ్లో ఉంది. ఇది మంజూరై ఉంటే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో అనేక పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం దొరికేది.
సింగరేణి కష్టం పట్టించుకోలే..
సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు విషయంపై కేంద్రం నోరు మెదపలేదు. ఆదాయ పన్ను స్లాబుల పెంపు ప్రకటన సమయంలో సింగరేణిపై ప్రకటన వస్తుందనుకున్నా రాలేదు. రూ.3 లక్షల వరకు పన్ను కట్టాల్సిన పని లేకున్నా.. రూ.3లక్షల నుంచి రూ.6లక్షల స్లాబ్లో 5శాతం పన్ను చెల్లించాలి. ఇది సింగరేణి కార్మికులకు కొంత వరకు మాత్రమే ఊరట కల్పించనుంది. మెజార్టీ కార్మికులకు మాత్రం దీంతో ఎలాంటి లాభం లేదు. బొగ్గు గనుల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పని చేసే కార్మికులకు పన్ను మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం దున్నపోతుపై వాన పడ్డట్లు వ్యవహరిస్తున్నదని కార్మిక వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సింగరేణిలో మరో కీలక అంశం బొగ్గుబ్లాక్ల ప్రైవేటీకరణ. మొన్నటికి మొన్న రామగుండం పర్యటనలో సింగరేణిని ప్రైవేటీకరించబోమని ప్రధాని మోదీ చెప్పారు. కానీ ఆయన వెళ్లిన నెలరోజులకే బొగ్గుబ్లాక్లను వేలం వేస్తున్నట్లు కేంద్రం మంత్రి ప్రకటించారు. దీంతో ఈ సమావేశంలో దానిపై స్పష్టత వస్తున్నది, సింగరేణిని ప్రైవేటీకరించబోమని కేంద్రం చెబుతుందేమోనని ఎదురుచూశారు. కానీ దాన్ని ఆమె ఎక్కడా ప్రస్తావించలేదు.
అమృత్కాల్ పేరుతో విషకాల్
అమృత్ కాల్ పేరుతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విష కాలానికి శ్రీకారం చుట్టింది. ఈ బడ్జెట్తో దేశానికి గానీ, రాష్ర్టానికి గానీ ఎలాంటి ప్రయోజనం లేదు. కేవలం బీజేపీ పాలిత రాష్ర్టాల కోసం, కార్పొరేట్ స్నేహితుల కోసమే ఈ బడ్జెట్ పెట్టింది. జిల్లాకు సంబంధించి గత ఎనిమిదేళ్లుగా చేస్తున్న డిమాండ్లలో ఏ ఒక్క దాన్ని పట్టించుకోలేదు. రైల్వే లైన్లు, నవోదయ పాఠశాలలు, సింగరేణి కార్మికుల పన్ను మినహాయింపు అంశాలను పరిగణలోకే తీసుకోలేదు.
–వెంకటేశ్ నేతకాని, ఎంపీ పెద్దపల్లి
కార్మికుల ఆశలపై నీళ్లు
సింగరేణి కార్మికుల ఆశలపై ఈ బడ్జెట్ నీళ్లు చల్లింది. నామమా త్రం స్లాబ్ పెంచి వదిలేసింది. అది కేవలం కంటితుడుపు చర్య తప్ప మరొకటి కాదు. దీంతో కార్మికులకు వచ్చేదేం లేదు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి మాత్రమే. దేశంలో ఏ వర్గానికీ కూడా ఇది సంతృప్తి కలిగించదు. శ్రమ జీవులకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. రైతులు, పేదవాళ్లు, కష్టజీవులు ఎవరికీ ఇది న్యాయం చేయలేదు. బీజేపీ పాలిత రాష్ర్టాల కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉంది.
–కెంగర్ల మల్లయ్య, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్