ఎదులాపురం,డిసెంబర్12: ప్రజావాణిలో వచ్చిన ప్రజల అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్, అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పేదలకు ప్రభుత్వ సహకారం అందించడం, అర్హులకు పథకాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. బంగారు గూడ కాలనీలో విద్యుత్ సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఈకి సూచించారు. భూసమస్యలపై ధరణి వెబ్సైట్లో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీఆర్డీఏ కిషన్, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
ప్రజా అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని నిర్మల్ అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్లు అర్జీలను స్వీకరించి, వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొత్తం 13 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు రవికుమార్, లోకేశ్వర్రావు, శివప్రసాద్, సుభాష్చందర్, విజయలక్ష్మి, రవీందర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, అంజిప్రసాద్, శ్రీనివాస్రెడ్డి, తనూజ, శశికళ, అశ్వక్అహ్మద్ పాల్గొన్నారు.
గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు
గిరిజనుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడారుఉ. దర్బార్కు వచ్చే దరఖాస్తులను శాఖల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షించి, పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. అధికారులు సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ సహాయక కలెక్టర్ పీ శ్రీజ, ఏపీవో జనరల్ కనక భీంరావు, డీడీ దిలీప్ కుమార్, అదనపు వైద్యాధికారి మనోహర్, ఏపీవో పీవీటీజీ ఆత్రం భాస్కర్, ఏవో రాంబాబు, ఓఎస్డీ కృష్ణయ్య, డీపీవో ప్రవీణ్, అధికారులు పాల్గొన్నారు.