నిర్మల్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ):నిర్మల్ జిల్లాలో మేలైన పశు సంపదను అభివృద్ధి చేసేందుకు జాతీయ కృత్రిమ గర్భోత్పత్తి కార్యక్రమాన్ని పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మూడేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మేలు జాతి దేశీయ, సంకరజాతి ఆంబోతు, దున్నపోతుల నుంచి సేకరించిన వీర్యంతో సాధారణ పశువులకు కృత్రిమ గర్భధారణ చేయిస్తున్నారు. జిల్లాలో 1,79,000 ఆవులు, 1,22,000 బర్రెలు ఉన్నాయి. వీటిలో పాలిచ్చేవి 90 వేల వరకు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో కృత్రిమ గర్భోత్పత్తి కార్యక్రమాన్ని మూడు విడుతల్లో నిర్వహించారు. 47 వైద్యశాలల పరిధిలోని గ్రామాల్లో పశు వైద్య సిబ్బంది, 17 మంది గోపాల మిత్రలు విస్తృతంగా పర్యటించి 57,315 ఆవులు, బర్రెల్లోకి ఒంగోలు, ముర్రా, జెర్సీ, ఆంబోతుల వీర్యాన్ని ప్రవేశపెట్టి 16,609 ఉత్తమ పశు సంతతిని అభివృద్ధి చేశారు. ఏటా జిల్లా పశు సంవర్ధక శాఖ పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. –
వ్యాధుల వ్యాప్తి అడ్డుకట్ట
మేలు జాతి ఆంబోతుల వీర్యాన్ని స్థానిక పశువుల్లో ప్రవేశపెట్టడం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. గర్భధారణకు అనుకూలమైన సమయంలో ఉన్నప్పుడు ఆవులు, బర్రెల ప్రత్యుత్పత్తి నాళంలో వీర్యాన్ని ప్రవేశపెడుతారు. బర్రెలు సెప్టెంబరు నుంచి మార్చి వరకు, ఆవులు సంవత్సరం పొడవునా ఎదకు వస్తాయి. పాడి పశువుల్లో జన్యు లక్షణాల పెరుగుదలకు అనుసరిస్తున్న ఈ సాంకేతిక కృత్రిమ గర్భధారణతో మేలు జాతి దూడలు పుట్టేందుకు అవకాశం ఏర్పడుతోంది. పశువుల్లో జన్యు లక్షణాలు అభివృద్ధి చెంది మూడు తరాల తర్వాత అవి పూర్తి స్థాయి సంకరజాతి లక్షణాలను పులుముకుంటాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. పశువుల్లో వచ్చే వ్యాధి వ్యాప్తిని కూడా అరికట్టవచ్చునని వారంటున్నారు.
అదనంగా 1.35 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి
కృత్రిమ గర్భధారణతో మేలు జాతి పశు సంపదతో పాటు పాల ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉంది. స్థానిక పశువులు రోజుకు రెండున్నర లీటర్ల వరకు పాలను ఇస్తుండగా..కృత్రిమ గర్భధారణ వల్ల పుట్టిన మేలు జాతి పశువులు 6 నుంచి 8 లీటర్ల వరకు పాలను ఇవ్వనున్నాయి. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 2.14లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. దీంతో రైతాంగానికి సుమారు రూ.52 లక్షల వరకు లబ్ధి చేకూరుతున్నది. ప్రభుత్వం పశుగణాభివృద్ధికి చేపడుతున్న చర్యల ఫలితంగా రానున్న రెండేళ్ల కాలంలో మేలు జాతి పశువుల వృద్ధి మరింతగా పెరగనుంది. తద్వారా అదనంగా 1.35 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి పెరగనుంది.
పాడి రైతులకు ప్రయోజనం
ప్రభుత్వం అమలు చేస్తున్న కృత్రిమ గర్భధారణ కార్యక్రమంతో పాడి రైతులకు విస్తృత ప్రయోజనాలు చేకూరుతున్నాయి. పశు సంపద, పాల ఉత్పత్తి పెరుగడం వల్ల రైతులు ఆర్థికంగా రాణించే అవకాశం ఉంటుంది. జిల్లాలో మూడేళ్లలో మూడు దఫాలుగా అమలు చేశాం. గర్భధారణ చేసిన పశువుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. గర్భధారణ ఇంజక్షన్లను ఉచితంగానే అందజేస్తున్నాం. బహుళ ప్రయోజనాలు ఉన్న ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని పశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లను ఇప్పించాలని కోరుతున్నాం.
-రమేశ్ కుమార్, పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి, నిర్మల్