ఖానాపూర్ టౌన్, జనవరి 1: ఖానాపూర్ మున్సిపాలిటీ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని వసతులు కల్పిస్తూ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఖానాపూర్లో ప్రస్తుతం అండర్ డ్రైనేజీ నిర్మిస్తుండడంతో మురుగు సమస్య నుంచి ప్రజలకు మోక్షం లభించినట్లయ్యింది. వానకాలంలో కొద్దిపాటి వర్షానికి డ్రైనేజీలు నిండి వరద రోడ్లపైకి వచ్చేది. ప్రజలు నడవడానికీ కష్టంగా ఉండేది. డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఎమ్మెల్యే రేఖానాయక్ రూ. 16 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో మున్సిపాలిటీలోని పలు అభివృద్ద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. సాయిబాబా ఆలయం నుంచి తెలంగాణ చౌరస్తా మీదుగా ఇంద్రానగర్ వరకు రోడ్డు వెడల్పుతో పాటు అండర్ డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయి. పనుల్లో నాణ్యత లోపాలు లేకుండా మున్సిపల్ చైర్మన్ రాజేందర్ అధికారులతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అభివృద్ధి పనులతో ఖానాపూర్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అభివృద్ధి పనులకు పట్టణ ప్రజలు, వ్యాపారులు సహకరించాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. సెంట్రల్ లైటింగ్తో ఖానాపూర్ పట్టణం జిగేల్మంటున్నది. పనులు పూర్తయితే రానున్న రోజుల్లో రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా సాఫీగా వెళ్లిపోయి శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వసతులు మెరుగు పడుతున్నాయి:
సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ఖానాపూర్ మున్సిపాలిటీలో వసతులు మెరుగుపడుతున్నాయి. మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులతో పాటు అండర్ డ్రైనేజీ నిర్మాణంతో పట్టణానికి కొత్త శోభ వచ్చింది. ఖానాపూర్ మున్సిపాలిటీగా ఏర్పడ్డాక అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో సుందరగా కనిపిస్తున్నది. పట్టణ ప్రజలకు అవసరమయ్యే మౌళిక వసతులను సకాలంలో పూర్తి చేయడంతో ఇబ్బందులు తొలగనున్నాయి. రోడ్డు వెడల్పు, డ్రైనేజీ పనులు కొనసాగుతుండడంతో రోడ్లపై వరద నిల్వకుండా ఉండి ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని ఆశిస్తున్నాం. ప్రమాదాలకు ఆస్కారం ఉండదు.
ఎనగందుల నారాయణ, ఖానాపూర్
దశల వారీగా పరిష్కారం
డ్రైనేజీ నిర్మాణ పనులను నిత్యం పరిశీలిస్తు న్నాం. ఎమ్మెల్యే సహకారంతో ఖానాపూర్ మున్సిపాలిటీలోని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నాం. కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడడంతో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. పట్టణ ప్రగతి కార్యక్రమంతో మున్సిపాలిటీలోని వార్డులు అభివృద్ధి చెందాయి. భవిష్యత్లో సమస్యలు తలెత్తకుండా ప్రధాన రహదారికి ఇరువైపులా అండర్ డ్రైనేజీ నిర్మిస్తున్నాం. ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి పాలకవర్గం కృషి చేస్తున్నది. దీర్ఘకాలిక సమస్యలను ఎమ్మెల్యే రేఖానాయక్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా.
అంకం రాజేందర్, మున్సిపల్ చైర్మన్, ఖానాపూర్