బాసర : బాసర సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు శుక్రవారం సరస్వతి అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో దర్శనం ఇచ్చారు. ఆలయంలో అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించారు. అర్చకులు అమ్మవారి క్షేత్రంలో పుణ్యహవచనము, అంకురార్పన, నివేదనఆరతి, చతుర్వద సేవలు, తదితర పూజలు నిర్వహించారు. సరస్వతీ అమ్మవారిని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే విఠల్రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం రూ. 7కోట్ల 50లక్షలతో నూతనంగా నిర్మించిన అతిథి గృహాలను ఆయన ప్రారంభించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు సూచించారు. ఆయన వెంట జడ్పీచైర్పర్సన్ విజయలక్ష్మి, నాయకులు లోలం శ్యాంసుందర్, తదితరులున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం మూడవ రోజు అమ్మవారు చంద్రఘంట రూపంలో దర్శనం ఇవ్వనున్నారు.