కడెం, సెప్టెంబర్ 28 : పులుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎఫ్డీపీటీ వినోద్ కుమార్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మంగళవారం అటవీశాఖ ఆధ్వర్యంలో ఏ ర్యాలీ ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కడెం మండలం ఉడుంపూర్ రేంజ్ పరిధిలోని ఐ లవ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోగో దగ్గర నుంచి వారు ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులకు అడవుల గురించి అవగాహన కల్పించారు. ఐ లవ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోగో వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను అధికారులు తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎఫ్డీపీటీ మాట్లాడారు. దేశంలోని అన్ని టైగర్ రిజర్వ్లను కలుపుతూ పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వారిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్టీసీఏ) ఇండియా ఫర్ టైగర్స్ ఏ ర్యాలీ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఐ లవ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోగో దగ్గర నుంచి మహారాష్ట్ర మీదుగా ఒడిషాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ వద్ద ఈ ర్యాలీ ముగిస్తుందని చెప్పారు. తమను మైదాన ప్రాంతాలకు తరలిస్తామని పదేళ్ల నుంచి చెప్తున్నారని, ఇప్పటి వరకు తరలించలేదని మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్ ప్రాంతాలైన మైసంపేట, రాంపూర్ గ్రామాల ప్రజలు కలెక్టర్, ఎఫ్డీపీటీకి విన్నవించారు. ఇందుకు వారు స్పందిస్తూ.. ఆరు నెలల తర్వాత మైదాన ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఎఫ్వోలు వికాస్ మీనాన్, శివాని, ఎఫ్డీవో కోటేశ్వర్ రావు, మాధవ్రావు, తహసీల్దార్ కలీం, ఎఫ్ఆర్వోలు అనిత, పోచమల్లు, వినాయక్, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.