నిర్మల్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలు ఉన్న నిరుపేద కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నాయి. పేద కుటుంబాల్లోని ఆడ పిల్లల పెండ్లి, వారి తల్లి దండ్రులకు తలకు మించిన భారం. ఉద్యమ సమయంలో చాలా సార్లు ఈ సమస్య అప్పటి ఉద్యమ నాయకుడు, ప్రస్తుత సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చింది. రాష్ట్రం ఏర్పడగానే ఈ సమస్యపై ఆలోచన చేసి, 2017 మార్చిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రారంభించారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి 2022 జూలై 31 వరకు నిర్మల్ జిల్లాలో 26,425 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఆయా కుటుంబాలకు మొత్తంగా రూ.222 కోట్ల 80 లక్షలను అందజేశారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఇంటికి చెక్కులు అందిస్తుండడంతో వారి కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అందిస్తున్న రూ. 1,00,116తో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భారం తప్పుతున్నది. అంతే కాకుండా అప్పులు చేయాల్పిన అవసరం లేకుండా పోతున్నది. వివాహం అయిన వెంటనే స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటున్నారు. మంజూరైన చెక్కులను స్థానిక మంత్రి అల్లోల ఇంక్రరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్ ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. తాజాగా ఈనెల 2న నిర్మల్ నియోజకవర్గంలో 427 మంది లబ్ధిదారులకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
నిర్మల్ జిల్లాలో 26,425 కుటుంబాలకు..
పేదింటి ఆడపిల్లల పెళ్లి వారి తల్లిదండ్రులకు భారం కాకూడదన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలిచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ పథకాల ద్వారా నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 26425 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2426 కుటుంబాలు, 2017-18లో 3526 కుటుంబాలు, 2018-19లో 4721 కుటుంబాలు, 2019-20లో 2570 కుటుంబాలు, 2020-21లో 3755 కుటుంబాలు, 2021-22లో 6927 కుటుంబాలు, అలాగే 2022లో ఇప్పటి వరకు 2500 కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వీరిలో 4688 ఎస్సీ కుటుంబాలు ఉండగా, రూ. 38 కోట్ల 7లక్షల 39వేలను పంపిణీ చేశారు, అలాగే 3291 ఎస్టీలు ఉండగా రూ.28 కోట్ల 60 లక్షల 13 వేలు పంపిణీ చేశారు. బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వారు 12,239 కుటుంబాలు ఉండగా వీరికి రూ.107 కోట్ల 34లక్షల 2వేలను పంపిణీ చేశారు. అలాగే షాదీముబారక్ పథకం కింద 6207 ముస్లిం మైనారిటీ కుటుంబాలకు రూ.48 కోట్ల 78లక్షల 43వేలను పంపిణీ చేశారు. ఇలా మొత్తం ఆయా వర్గాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఇప్పటి వరకు రూ. 222.80 కోట్లను ప్రభుత్వం అందజేసింది.
ప్రభుత్వ సాయం మరువలేం…
మాది నిరుపేద కుటుంబం. నాకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. నా భర్త సాయన్న 2015లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. 2020లో పెద్ద కూతురు నందినికి పెండ్లి చేసిన. చేతిల చిల్లి గవ్వ లేకుండే. పెండ్లి కోసం చుట్టాల దగ్గర అప్పు తీసుకున్న. పెండ్లి అయిన 10 రోజులకు కల్యాణలక్ష్మి కింద ప్రభుత్వం నుంచి లక్ష రూపాల సాయం అందింది. అప్పులు కట్టేసిన. ప్రతీ నెల వితంతు పింఛను వస్తున్నది. ప్రభుత్వ సాయం మరువలేం.
పేదోళ్ల దేవుడు కేసీఆర్ సారు…
మాలాంటి పేదలకు కేసీఆర్ సారు దేవుడు. నా బిడ్డ లావణ్యకు ఐదేండ్ల వయసు ఉన్నప్పుడే భర్త చేపలు పట్టబోయి కంచరోని చెరువులో మునిగి చనిపోయిండు. నాటి నుంచి బీడీలు చుట్టుకుంటూ తండ్రి లేని ఒక్కగానొక్క బిడ్డను కష్టపడి సదివించుకున్న. పెండ్లి ఎట్ల చేయాలని చాలా దిగులైంది. మా కౌన్సిలర్ రమ్య ఒక రోజు ఇంటికి వచ్చి పెండ్లి కోసం బాధపడకు, కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాలు అస్తయని చెప్పింది. మూడేండ్ల కింద పెండ్లి చేసిన. చెప్పినట్లే వారం రోజులకే లక్ష రూపాల సాయం అందింది.
– మట్టి లక్ష్మి, నిర్మల్
పేదింటి పెద్ద కొడుకు సీఎం కేసీఆర్..
నిరుపేద కుటుంబాలకు పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకొని ఆడపిల్లల పెళ్లి కోసం సీఎం కేసీఆర్ ఎంతో సాయం చేస్తున్నరు. అయిన వాళ్లే సాయం చేయమంటే ఆమడ దూరం పోతున్న ఈ రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది. ఇలాంటి పథకాలు లేకుంటే ఎన్నో పేద కుటుంబాలు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవి. ఈ పథకం ద్వారా ఆడ పిల్లల తల్లిదండ్రులకు పెళ్లి భారం తగ్గింది. మహిళల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేసి చూపుతున్న సీఎం కేసీఆర్కు మహిళలు ఎప్పటికీ రుణపడి ఉంటరు.
-కే.విజయలక్ష్మి, జడ్పీ చైర్పర్సన్
తల్లిదండ్రులకు భారం కాకుండా…
ఆడ పిల్లల లగ్గం వ్యవహారం వారి తల్లి దండ్రులకు భారం కావద్దనే ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి పథకాలు అమలు కావడం లేదు. ఈ పథకం అమలులో పూర్తి పారదర్శకత పాటిస్తూ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. దళారుల ప్రమేయానికి అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.
-అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి