నిర్మల్ టౌన్, అక్టోబర్ 27 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సంచలనం సృష్టించిన సారంగాపూర్ మండలం బీరవెల్లి మ్యాక్స్ సొసైటీ భారీ చోరీ ఘటనను నిర్మల్ పోలీసులు వారంలోనే ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గురువారం అరెస్టు చేసినట్లు నిర్మల్ ఎస్పీ ప్రవీణ్కుమార్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 10న అర్ధరాత్రి 12 గంటల సమయంలో సారంగాపూర్ మండలం బీరవెల్లి మ్యాక్స్ సొసైటీలో గుర్తు తెలియని దుండగులు కిటికీలను ధ్వంసం చేశారు. అందులోని లాకర్తో సహా రూ. 7.90లక్షలు ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు విధులకు హాజరైన మ్యాక్స్ సిబ్బంది చోరీ ఘటనను గుర్తించారు. సొసైటీ అధ్యక్షుడు లక్కడి గంగారెడ్డి సారంగాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను పోలీసుశాఖ సీరియస్గా తీసుకుంది. అక్కడికి క్లూస్టీం, డాగ్స్వాడ్ బృందాలతో పాటు ప్రత్యేక ఐడీ పార్టీలను పంపించారు. చోరీ ఘటనను సవాల్గా తీసుకొని దర్యాప్తును వేగవంతం చేశారు. నిర్మల్ డీఎస్పీ ఉపేందర్రెడ్డి, సీఐలు వెంకటేశ్, రాంనర్సింహారెడ్డి, ఎస్ఐలు కృష్ణసాగర్, గంగాధర్, గీతతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. ఆరు బృందాలు నిందితుల కోసం ముమ్మరంగా గాలించారు.
నిందితులు పక్కగా రెక్కీ చేసి చోరీకి ప్రణాళిక వేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. పథకం ప్రకారం అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు రాథోడ్ దత్తు, ఎండీ రాజీపూల్, సంతోష్రాథోడ్, అడె సురేశ్, ప్రకాశ్ మడావి, ఎనుధర్ కుండలిక్ పవార్, సంతోష్ పుండలిక్ పవార్తో పాటు హన్మంత్, కసావాకర్ చిన్న (ఒడ్డె శ్రీను) చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. బీరవెల్లిలో ట్రాక్టర్ నడుపుతున్న ఒడ్డె శ్రీను సహకారంతో ఈ చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. లాకర్లోని డబ్బులు కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఒడ్డె శ్రీను, అతని మామ హన్మంత్, మరో స్నేహితుడు మడావి ప్రకాశ్, ఆడె సురేశ్తో చర్చించారు. చోరీ విషయమై దత్త రాథోడ్ గ్యాంగ్ను సంప్రదించారు.మ్యాక్స్కు సంబంధించిన సొసైటీ కార్యాలయంలో లొకేషన్ను వారికి షేర్ చేశారు. వీరిచ్చిన సమాచారం మేరకు దత్త రాథోడ్, రాజీపూల్, సంతోష్ రాథోడ్, సురేశ్ బీరవెల్లికి చేరుకున్నారు. స్థానికులు ప్రకాశ్, హన్మంత్తో కలిసి అదే రాత్రి చోరీకి పాల్పడ్డారు. లాకర్ను కారులో పెట్టి మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా దాహివాడ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ వారి స్నేహితులైన ఎనుధర్ కుండలిక్ పవార్, సంతోష్ పవార్ సహాయంతో కట్టర్తో లాకర్ను పగులగొట్టి డబ్బులు పంచుకున్నారన్నారు.
సొమ్ము రికవరీ..
చోరీ ఘటనను సవాల్గా తీసుకొని నిందితులను త్వరగా పట్టుకోవడంతో భారీగా సోమ్ము రికవరీ అయినట్లు ఎస్పీ ప్రవీణ్కుమార్ తెలిపారు. చోరీ చేసిన సొత్తు రూ. 7.90లక్షల నుంచి రూ.6లక్షలు రికవరీ చేసినట్లు తెలిపారు.దత్త రాథోడ్ నుంచి రూ. 2.40లక్షలు, రాజీపూల్ నుం చి రూ. 1.40 లక్షలు, సంతోష్ రాథోడ్ నుంచి రూ.59వేలు, ఆడె సురేశ్ నుంచి రూ. 60వేలు, మడావి ప్రకాశ్ నుంచి రూ. 51,150, ఎనుధర్ పుండలిక్ పవార్ నుంచి రూ. 25వేలు, సంతోష్ పవార్ నుంచి రూ. 25వేలు మొత్తం రూ. 6.15 లక్షలు రికవరీ చేశారు. నిందితులు వినియోగించిన రెండు ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. చోరీలో పాల్గొన్న దత్త రాథోడ్, సంతోష్ రాథోడ్, సురేశ్ ఆడె, ప్రకాశ్ మడావి, ఎనుధర్ పుండలిక్ పవార్, సంతోష్ పుండలిక్ పవార్ది మహారాష్ట్ర. ఎండీ రాజీపూల్ది బిహార్. వీరందరినీ అరెస్టు చేశామని ఎస్పీ వెల్లడించారు. హన్మంత్, ఒడ్డె శ్రీను పరారీలో ఉన్నట్లు వివరించారు. వీరిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. మ్యాక్స్ చోరీ ఘటనను ఛేదించిన నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐలు వెంకటేశ్, రాంనర్సింహారెడ్డి, చంద్రమోహన్, కృష్ణసాగర్రెడ్డి, గంగాధర్, గీత, ఏఎస్సై సిరాజ్, కానిస్టేబుల్ రవీందర్రెడ్డి, మనోజ్వర్మ, సునీల్ను ఎస్పీ అభినందించారు. ఇండ్లు, సంఘాల్లో భారీ మొత్తంలో డబ్బు నిల్వ ఉంచుకోకుండా బ్యాంకుల్లో దాచుకోవాలలన్నారు. గ్రా మాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అవసరమైతే హోంగార్డులు, సేఫ్టీ అలారం వినియోగించుకుంటే చోరీలకు ఆస్కారం ఉండదని ఎస్పీ తెలిపారు.