నేరడిగొండ, జూన్ 14 : సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. మండలంలోని కుమారి, నేరడిగొండ, యాపల్గూడ గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను మంగళవారం జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్తో కలిసి పరిశీలించారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా నేరడిగొండ ప్రాథమిక పాఠశాలలో చేపడుతున్న అభివృధ్ధి పనులను పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, విద్యార్థుల చదువు, హాజరుశాతంపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న ఆహారం, పిల్లల బరువు చూశారు. అనంతరం తెలంగాణ క్రీడా మైదానాల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. మైదానాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను పరిశీలించారు. నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కుమారి గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్డులో సేంద్రియ ఎరువుల తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. యాపల్గూడలో నీటి సమస్య ఉందని చెప్పడంతో సంపు నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్లు పెంట వెంకటరమణ, రాజుయాదవ్, మండాడి గోదావరి, ఎంపీడీవో అబ్దుల్సమద్, తహసీల్దార్ పవన్చంద్ర, ఎంపీవో శోభన, ఈజీఎస్ ఏపీవో వసంత్రావ్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఫెరోజ్, పీఆర్ఏఈ అభినవ్, పంచాయతీ కార్యదర్శులు దయాకర్, రాఘవేంద్ర, జ్యోతి, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తనిఖీ చేశారు. పీహెచ్సీలోని జనరల్ వార్డు, కొవిడ్ వ్యాక్సిన్, పరీక్షల గదులను పరిశీలించారు. రోజు వారీగా వచ్చే రోగుల వివరాలు డాక్టర్ లావణ్యను అడిగి తెలుసుకున్నారు. ప్రసవాలు, తదితర విషయలపై ఆరా తీశారు. పీహెచ్సీలో పరీక్షలు, ఓపీ పెంచాలని డాక్టర్కు సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఆయన వెంట సర్పంచ్ వెంకటరమణ, హెచ్ఈవో హరికుమార్గౌడ్, హెల్త్ సూపర్వైజర్ రాంనరేశ్, సిబ్బంది ఉన్నారు.
పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు
పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే శాఖ పరంగా చర్యలు తప్పవని జడ్పీసీఈవో గణపతి పంచాయతీ కార్యదర్శులకు హెచ్చరించారు. మండలంలోని దామన్గూడ, ముత్నూర్ గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీలించారు. దామన్గూడలో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్కు సూచించారు. గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామం, నర్సరీలను పరిశీలించారు. ఆయన వెంట ముత్నూర్ సర్పంచ్ విజయ్, మండల ప్రత్యేకాధికారి శివరాం, ఎంపీడీవో సునీత, ఎంపీవో లింగయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని మండల పంచాయతీ అధికారి జీవన్రెడ్డి సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా పిప్పిల్ధరి, బోథ్ గ్రామాల్లో పారిశుధ్యం, ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో సర్పంచ్ శ్రీధర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు అంజయ్య, రజిత, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
శుభ్రతతోనే ఆరోగ్యం
శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని సర్పంచ్ ఆత్రం మహేశ్వరీవామన్ అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గాదిగూడ మండలం రాంపూర్ గ్రామంలో హెల్త్ డే నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కుమ్ర మాణిక్రావ్, అంగన్వాడీ టీచర్ కమల, బిజాబాయి, చామెలిబాయి పాల్గొన్నారు.
పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని రాజన్నగూడ, సాలేవాడ(బీ), కుమ్మరితండా గ్రామాల్లో ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ పర్యటించారు. గ్రామాల్లో శానిటేషన్ పనులు, క్రీడా మైదానాలు, నర్సరీలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో తిరుమల, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, ఏపీవో రజినీకాంత్, సర్పంచ్ బాజీరావ్, పంచాయతీ కార్యదర్శి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.
మండలంలోని జామిని గ్రామంలో పల్లెప్రగతి పనులను డీపీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. క్రీడా మైదానాన్ని పరిశీలించారు. అంతకు ముందు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం రాత్రి గ్రామంలో పల్లెనిద్ర చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, ఎంపీవో వెంకట్రాజు, ఏఈ శేఖర్, నాయకులు మోహన్, తానాజీ, భరత్ పాల్గొన్నారు.