ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్తో పాటు ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తరలివచ్చి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 91.78 శాతం పోలింగ్ నమోదుకాగా, అత్యధికంగా నిర్మల్ పోలింగ్ కేంద్రంలో 100 శాతం, తక్కువగా మంచిర్యాలలో 82.21 శాతం నమోదైంది. సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రక్రియ కొనసాగగా, ఆదిలాబాద్ కంట్రోల్ రూం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల పరిశీలకుడు నవీన్ మిట్టల్, రిటర్నింగ్ అధికారి సిక్తా పట్నాయక్ ఎప్పటికప్పుడు పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్గోయల్ ఆయా జిల్లాల కలెక్టర్లతో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్స్లను సీజ్ చేసి ఆదిలాబాద్ టీటీడీసీలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చారు. కాగా, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి దండె విఠల్, ఇండిపెండెంట్ అభ్యర్థి పుష్పరాణి పోటీలో ఉన్నారు. 937 మంది ఓటర్లు ఉండగా, వారంతా తమ సమీప ప్రాంతాల్లో ఓటు వేసేందుకు అధికారులు 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఓటర్లు భౌతికదూరం పాటిస్తూ ఓటు వేశారు. వైద్య సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి లోపలికి అనుమతించారు. 10 గంటల వరకు 44.50 శాతం, 12 గంటలకు 77.05 శాతం, మధ్యాహ్నం 2 గంటలకు 87.73 శాతం, పోలింగ్ ముగిసే సమయానికి 91.78 శాతం పోలింగ్ నమోదైంది. నిర్మల్ పోలింగ్ కేంద్రంలో 100 శాతం నమోదు కాగా, తక్కువగా మంచిర్యాల పోలింగ్ కేంద్రంలో 82.21 శాతం నమోదైంది. ఆదిలాబాద్ పోలింగ్ కేంద్రంలో 88.95 శాతం, ఉట్నూర్ పోలింగ్ కేంద్రంలో 97.62 శాతం, బెల్లంపల్లిలో 86.36 శాతం, భైంసాలో 97.06 శాతం, ఆసిఫాబాద్లో 97.10 శాతం, కాగజ్నగర్లో 97.92 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు.
ఉదయం నుంచి భారీగా పోలింగ్..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి భారీగా పోలింగ్ నమోదైంది. ఆయా నియోజకవర్గాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, విఠల్రెడ్డి, జోగు రామన్న, రేఖానాయక్, రాథోడ్ బాపురావ్, ఆత్రం సక్కు, జడ్పీ చైర్మన్లు కోవ లక్ష్మి, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, రాథోడ్ జనార్దన్తో పాటు కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఆదిలాబాద్ కంట్రోల్ రూం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ఉమ్మడి జిల్లాలోని 8 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ తీరును ఎన్నికల పరిశీలకులు నవీన్ మిట్టల్, రిటర్నింగ్ అధికారి సిక్తా పట్నాయక్, అధికారులు పరిశీలించారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ బాక్స్లను సీజ్ చేసి ఆదిలాబాద్కు తీసుకువచ్చారు. స్ట్రాంగ్ రూంలలో బ్యాలెట్ బాక్స్లను భద్రపర్చి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల ప్రధానాధికారి
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్గోయల్ ఆదిలాబాద్ జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రంతో పాటు ఉట్నూర్, నిర్మల్, మంచిర్యాల పోలింగ్ కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు సిక్తాపట్నాయక్, ముషాఫ్ అలీ ఫారూఖీ, భారతీహోళికేరితో కలిసి పరిశీలించారు. పోలింగ్, కేంద్రాల్లో ఏర్పాట్లు, కొవిడ్ నిబంధనలు, ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులకు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. కౌటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
టీఆర్ఎస్కు భారీ మెజారిటీ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 937 మంది ఓటర్లు ఉండగా, అత్యధికంగా టీఆర్ఎస్కు చెందిన వారే ఉండడంతో గెలుపుఖాయమని తెలుస్తుంది. శుక్రవారం వివిధ పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 91.78 శాతం పోలింగ్ జరగగా, టీఆర్ఎస్ అభ్యర్థికి 90 శాతానికి పైగా ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి.
టీఆర్ఎస్దే విజయం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్దే విజయం. మా పార్టీ అభ్యర్థి దండె విఠల్ భారీ మెజార్టీతో గెలుస్తారు. అత్యధిక ఓటర్లు టీఆర్ఎస్కు చెందిన వారే ఉండడంతో గెలుపు ఖాయమైంది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలంతా మా వెంటే ఉంటారు. సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నది అందరి నమ్మకం.
భారీ మెజార్టీతో గెలుస్తా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తా. అన్ని కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించాను. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 90 శాతానికి పైగా ఓట్లు నాకే వస్తాయి. నాకు మద్దతు ప్రకటించిన ఓటర్లందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
-దండె విఠల్, టీఆర్ఎస్ అభ్యర్థి