జీవితం మొత్తం సైన్స్తోనే ముడిపడి ఉందని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ పేర్కొన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ఫెయిర్, ఇన్స్పైర్ ప్రదర్శనల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు వైజ్ఞానిక ప్రదర్శనల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రయోగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
– నిర్మల్ అర్బన్, నవంబర్ 26
నిర్మల్ అర్బన్, నవంబర్ 26 : నిత్య జీవితం సైన్స్తోనే ముడిపడి ఉందని, విద్యార్థులు చదువుతో పాటు వైజ్ఞానిక ప్రదర్శనలపై దృష్టి సారించాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ఫెయిర్, ఇన్స్పైర్ ప్రదర్శనల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట ఎన్సీసీ విద్యార్థులతో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాంకేతికతకు తగ్గట్లుగా విద్యార్థులు ప్రదర్శనలు చేపట్టాలని, ఉపాధ్యాయులు ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రవి ఉన్నత పాఠశాల విద్యార్థులు చేపట్టిన స్వాగత నృత్యం, వ్యవసాయ రంగ ప్రాధాన్యతను వివరిస్తూ కుంటాల మోడల్ స్కూల్, మంజులాపూర్ ఉన్నత పాఠశాల, ప్లేయర్ హైస్కూల్ విద్యార్థులు చేపట్టిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, డీఈవో రవీందర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్, సెయింట్ థామస్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆంటోని, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ సిద్ధ పద్మ, సెక్టోరియల్ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సైన్స్ఫెయిర్ నిర్వహణ కమిటీల సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రదర్శనలు..
సెయింట్ థామస్ పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఇన్స్పైర్లో 17 ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు డీఈవో రవీందర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఫైజల్ ఖాన్ (భైంసా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల), సీ. దినేష్ (తానూర్ వాగ్ధేవి ప్రాథమిక పాఠశాల), కే మనూష (ఖానాపూర్ జడ్పీఎస్ఎస్ బాలికలు), ఎన్.శ్రీభావన్ ( భైంసా సర్వేశ్వర విద్యామందిర్), జాదవ్ పవిత్ర (మాటెగాం జడ్పీహెచ్ఎస్) ఎస్.ఆనంద్ (చిచోంద్ జడ్సీఎస్ఎస్), అఖీం, రమ్యకృష్ణ (తానూర్ విజేత మాడల్ స్కూల్), బీ.రాజవివేక్ (నిర్మల్ అల్ఫోర్స్ హైస్కూల్) , రాథోడ్ ఆకాష్ (ముథోల్ ప్రభుత్వ ఆశ్రమ బాలుర పాఠశాల), మొహినొద్దీన్ (భైంసా విన్నర్ హైస్కూల్), నాగరాజు (బిద్రెల్లి ఎంపీయూఎస్) , జాదవ్ అరవింద్ (ముథోల్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల) ఏ.నీలేష్ (ఆస్ట జడ్పీ హైస్కూల్), ఎస్.వినాయక్ (తానూర్ వివేకానంద ప్రైమరీ స్కూల్), వీ.శివాణీ (సారంగాపూర్ జాం రెసిడెన్షియల్), ఏ.విలాస్ (కామోల్ జడ్పీస్ఎస్), సభా సుతాన (కస్బా ఉన్నత పాఠశాల).
గ్యాస్ లీకైనప్పుడు సైరన్
– బీ.సుభాషిని, జడ్పీ ఉన్నత పాఠశాల, వడ్యాల్
అప్పుడప్పుడు ఇంట్లో గ్యాస్ ప్రమాదాలు జరుగుతుం టాయి. ఈ ప్రమాదంతో ఆర్థిక నష్టంతో పాటు ప్రాణాలు కూడా పోయే అవకాశముంటుంది. ఈ ప్రమాదం బారిన పడకుండా డీసీ మోటార్ ద్వారా సెన్సార్, విద్యుత్ బల్బుకు కేబుల్ను అనుసంధానం చేయాలి. దీంతో అది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. గ్యాస్ లీకైనప్పుడు సెన్సార్ ద్వారా ఆటోమేటిక్గా విద్యుత్ బల్బు ఆగిపోయి.సైరన్ వస్తుంది. అంతకుముందే ఏర్పాటు చేసుకున్న ఫ్యాన్ ఆటోమేటిక్గా ఆన్ అయి లీకైన గ్యాస్ను బయటకు పంపిస్తుంది. సైరన్ మోగడం ద్వారా ప్రమాదాన్ని పసిగట్టవచ్చు.
స్పీడ్ బ్రేకర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి
– ఒడ్నం ప్రత్యూష, జడ్పీ పాఠశాల, గొల్లమాడ, కుంటాల మండలం
నిత్య జీవతంలో విద్యుత్ వాడకం రోజు రోజుకూ పెరిగిపోతుంది. ప్రజలు విలాసవంతమైన జీవితం కోసం ఫ్రిజ్లు, ఏసీలు ఇతర ఎలక్ట్రిక్ పరికరాలను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనాల వేగాన్ని నిరోధించేందుకు ఏర్పాటు చేసే స్పీడ్ బ్రేకర్ల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. స్పీడ్ బ్రేకర్ల వద్ద ఒక రోలర్ ఏర్పాటు చేయాలి. దాని పై నుంచి వాహనాలు వెళ్లినప్పుడు ఒత్తిడికి గురై డీసీ మోటార్ కనెక్ట్ అవుతుంది. అప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
నీటిలో తేలియాడే ఇండ్లు
– అయిటి వర్షిణి, జడ్పీ పాఠశాల, చించోలి (యం)
వరదల్లో ఇండ్లు మునిగిపోవడాన్ని చూస్తుంటాం. నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల్లో తేలియాడే ఇండ్లు నిర్మించుకోవడం వల్ల నష్టాలు ఉండవని ఈ ప్రయోగం ద్వారా వివరించారు. ఇంటి నిర్మాణం కోసం పునాదులు అవసరం లేకుండా నాలుగు పొడవాటి రాడ్లు ఏర్పాటు చేసుకోవాలి. వరద వచ్చినప్పుడు రాడ్ల సహాయంతో ఇల్లు పైకి లేస్తుంది. మనం ఎంత పొడవాటి రాడ్లను ఏర్పాటు చేసుకుంటామో అంత వరకు ఇల్లు నీటిలో తేలియాడుతుంది.
విద్యుత్ ప్రమాదాల నివారణ
– ఎం.చిన్నయ్య, జడ్పీ పాఠశాల, అనంతపేట్, నిర్మల్ రూరల్
విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్లపై పడినప్పుడు జరిగే ప్రమాదాలను ఈ ప్రయోగం ద్వారా ముందస్తుగా గుర్తించవచ్చు. ప్రయోగానికి ఏర్పాటు చేసిన ఒక పరికరం ద్వారా విద్యుత్ను బల్బుకు సరఫరా చేసే బదులు అలారానికి సరఫరా అయ్యేలా ఏర్పాటు చేయాలి. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే అలారం మోగడం ప్రారంభమవుతుంది. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించవచ్చు.
సౌర విద్యుత్
– ఆడెపు ఆకృతి, ఎస్.వీ.ఎస్ శాంతినగర్, నిర్మల్
సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేసుకొని ఉచితంగా వాడు కోవచ్చు. నిత్య జీవితంలో విద్యుత్ ఎంతో అవసరం అవుతుంది. ఉచితంగా విద్యుత్ను తయారు చేసుకుని గృహ ఉపయోగాలకు వాడుకోవచ్చు. కొద్దిపాటి ఖర్చుతో సోలార్ పలకలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ను తయారు చేసుకోవచ్చు.