నిర్మల్ టౌన్, అక్టోబర్ 20 : నిర్మల్ జిల్లాలో నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వేచ్ఛయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్ భవనంలో ఎన్నికల నిర్వహణ, ఈవీఎం, వీవీప్యాట్ల పంపిణీ, పోలింగ్ కేంద్రాల నిర్వహణ, తదితర అంశాలపై అధికారులు, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని 906 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం మిషన్లు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు.
ఇప్పటికే రాజకీయ పార్టీల సమక్షంలో వాటిని పరిశీలించి సీజ్ చేశామన్నారు. ఈవీఎం మిషన్లపై అపోహలను తొలగించేందుకు పెద్దఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తామన్నారు. ఈవీఎం ప్యాడ్ల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఓటింగ్శాతం పెంచేందుకు జిల్లాలోని అన్ని మండలాల్లో, మున్సిపల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు, ర్యాలీలు, ఇతర సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ మద్యం, నగదుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎన్నికల ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. ఎన్నికల విధుల్లో నిర్వహించే వారికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని అందుకు అధికారులు, రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.