నిర్మల్ టౌన్, మార్చి 5: ‘సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం’ ద్వారా రాష్ట్ర సర్కారు మత్స్య కార్మికులకు చేయూతనందిస్తున్నది. వారికి జీవనోపాధి కల్పించడంలో భాగంగా చేపలు పట్టుకునేందుకు వలలు, విక్రయించుకునేందుకు వాహనాలు అందిస్తున్నది. దీంతో పాటు వందశాతం సబ్సిడీపై చేపపిల్లలను నీటి వనరుల్లో విడుదల చేస్తుండగా, వాటిని పెద్దవైన తర్వాత పట్టుకొని ఉపాధి పొందేలా చూస్తున్నది. ఈ క్రమంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో చేపల క్రయవిక్రయాలు, రవాణాకు వీలుగా రూ. 50 లక్షలతో మోడల్ ఫిష్ మార్కెట్ను నిర్మించింది. త్వరలోనే దీనిని ప్రారంభించనుండగా, తమ ఇబ్బందులన్నీ తొలగిపోను న్నాయని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర సర్కారు నిర్మించిన మోడల్ ఫిష్ మార్కెట్ ప్రారంభానికి సిద్ధమైంది. పట్టణంలోని భాగ్యనగర్ పాత చేపల మార్కెట్ పక్కన రూ.50 లక్షలతో ఈ కొత్త మార్కెట్ను నిర్మించారు. జిల్లాలో పుష్కలమైన నీటి వనరులు ఉన్నాయి. దీంతో సుమారు 12 వేల మంది చేపల వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతిరోజు చేపలు పట్టుకొని మార్కెట్ ద్వారా విక్రయించుకుంటున్నారు. జిల్లాలోని శ్రీరాంసాగర్, కడెం, స్వర్ణవాగు, గోదావరి, గడ్డెన్నవాగు, తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మత్స్య కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం సబ్సిడీపై వలలు, మోపెడ్ వాహనాలు, ట్రాన్స్పోర్టు వాహనాలను అందించడంతో వాటిని వినియోగిస్తూ చేపల విక్రయాలు నిర్వహిస్తున్నారు. కాగా, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చొరవతో రూ. 50 లక్షలతో కొత్త మోడల్ మార్కెట్ రూపుదిద్దుకుంటున్నది. ప్రస్తుతం పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెలలోనే ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లు భాగ్యనగర్ పాత ఫిష్ మార్కెట్ కార్యాలయం వద్ద కనీస సౌకర్యాలు లేక అటు మత్స్య కార్మికులు, ఇటు ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొత్త మార్కెట్ అందుబాటులోకి వస్తే, ఆ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. పట్టిన చేపలను హైదరాబాద్, నాగ్పూర్, మహారాష్ట్ర, నిజామాబాద్ ప్రాంతాలకు తరలించేందుకు ఈ కొత్త మార్కెట్ ఉపయోగపడుతుందని మత్స్య కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి సహకారంతోనే..
నిర్మల్లో మోడల్ చేపల మార్కెట్ను నిర్మించాలని మంత్రి ఐకే రెడ్డికి విజ్ఞప్తి చేసినం. ఆయన చొరవతోనే రూ. కోటితో మత్స్య భవన్ ఇటీవల ప్రారంభించుకున్నం. జిల్లా కేంద్రం లో చేపలు విక్రయించుకునేందుకు మోడల్ మార్కెట్ ఏర్పాటు కూడా కట్టించి ఇచ్చిన్రు. చేపలు అమ్ముకునేం దుకు మంచి సౌలతు చేసిన్రు. మా జీవితాల్లో వెలుగు తెచ్చిన కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
–నర్సయ్య, మత్స్య సంఘం నాయకులు, నిర్మల్
మార్కెట్ను మంచిగ కట్టిన్రు..
ప్రస్తుతం మేం పట్టిన చేపలను భాగ్యనగర్లోని పాత చేపల మార్కెట్లో అమ్ముతున్నం. కానీ ఇక్కడ చాలా సమస్యలున్నయ్. రోడ్డుపైనే చేప లు విక్రయించడం వల్ల దుమ్ముతో ఆరోగ్యం పాడవుతున్నది. కొత్త చేపల మార్కెట్ను నిర్మించాలని మంత్రికి విన్నవించుకు న్నం. ఆయ న చొరవతో ఇప్పుడది పూర్తయ్యింది. త్వరలోనే ప్రారంభిస్తమని అంటున్నరు. చాలా సంతోషంగా ఉన్నది.
–శరత్, మత్స్యకార్మికుడు, బోయవాడ, నిర్మల్
మా ఇబ్బందులన్నీ పోతయ్..
తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే మా బతుకులు బాగైనయ్. ప్రభుత్వం మాకు వలలు, వాహనాలు ఇచ్చి ఆదుకున్నది. మా ఉపాధికి భరోసానిచ్చింది. రోజూ చేపలను పట్టి, కుటుంబాన్ని పోషించుకుం టున్నం. ఇప్పుడు వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను ప్రభుత్వమే చెరువుల్లో వేస్తున్నది. పైసా ఖర్చు లేకుండా పెద్ద చేపలతో మేం ఉపాధి పొందుతున్నం. మా జీవనోపాధికి భరోసానిచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి అల్లోలకు రుణపడి ఉంటం.
–సాయి, మత్స్య కార్మికుడు, నిర్మల్