Toll Charges | ఆదిలాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై మరో భారం మోపింది. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి, సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. తాజాగా జాతీయ రహదారులపై టోల్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకోగా, నేటి నుంచి అమల్లోకి తెచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో జైనథ్ మండలం పిప్పర్వాడ, నేరడిగొండ మండలం రోల్మామడ వద్ద టోల్ ప్లాజాలు ఉండగా, వీటి నుంచి నిత్యం 10 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కాగా, రహదారుల నిర్మాణం, నిర్వహణ లోపాలు పట్టించుకోని నేషనల్ హైవే అథారిటీ ధోరణిపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతుండగా, తాజాగా చార్జీల పెంపు నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను పెంచుతుపోతున్న కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మరోభారం వేసింది. జిల్లాలోని నేషనల్ హైవే టోల్ప్లాజాల వద్ద చార్జీలను పెంచి, ఈ రోజు నుంచే అమల్లోకి తెచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయాల కారణంగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో ధరలు ఆకాశాన్ని అంటగా, పేద, మధ్యతరగతి ప్రజల బతుకు భారంగా మారింది. పెరిగిన ధరలు తగ్గించాలని ప్రజలు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడడం లేదు. దీంతో కేంద్రం తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతుండడంతో రవాణా చార్జీలు పెరిగి ప్రజలపై ఇప్పటికే మోయలేని భారం పడుతున్నది. తాజాగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ప్లాజాల్లో వాహనాల ఫీజును పెంచి, మరో పిడుగు వేసింది. ఆదిలాబాద్ జిల్లాలో నేషనల్ హైవేపై జైనథ్ మండలం పిప్పర్వాడ, నేరడిగొండ మండలం రోల్మామడ వద్ద టోల్ ప్లాజాలున్నాయి. సరుకులు తీసుకెళ్లే ట్రాన్స్పోర్టు వాహనాలు ఎక్కువగా ఈ రోడ్డు మీదుగా వెళ్తుంటాయి. జిల్లా ప్రజలు కూడా తమ అవసరాల కోసం హైదరాబాద్తో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో టోల్ప్లాజాల వద్ద వాహనాలకు చార్జీలు వసూలు చేస్తారు.
నిత్యం రూ. 10 లక్షల అదనపు భారం
ఆదిలాబాద్ జిల్లాలోని జాతీయ రహదారి 44పై నేరడిగొండ మండలం రోల్మామడ, జైనథ్ మండలం పిప్పర్వాడ వద్ద 2008లో టోల్ప్లాజాలు ఏర్పాటు చేసి. టాక్స్ వసూలు చేస్తున్నారు. ఈ రహదారిపై నిత్యం 10 వేల వరకు వివిధ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కూడా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తాయి. ప్రస్తుతం టోల్ప్లాజాల్లో కార్లు, జీపులు లైట్ మోటార్ వెహికిల్స్పై 24 గంటల్లో రాకపోకలకు రూ.150, మినీ బస్సు, లైట్ కమర్షియల్ వెహికిల్కు రూ.240, బస్సులు, ట్రక్కులకు రూ. 500కు పెరిగింది. ఇతర భారీ వాహనాలకు రూ.545, రూ.865, రూ.955 వరకు ఉంది. కేంద్రం పెంచిన ధరల కారణంగా 5 శాతం మేర చార్జీలు పెరగనున్నాయి. దీంతో రోజూ ప్రయాణికులపై రూ.10 లక్షల భారం పడనున్నది. కాగా, నేటి నుంచే ధరలు అమల్లోకి రానున్నాయి. వాహనదారులతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పేదలు సైతం నష్టపోవాల్సి వస్తుంది.
అస్తవ్యస్తంగా రహదారి..
జిల్లాలోని జాతీయ రహదారి 44 నిర్వహణను ఎన్హెచ్ఏఐ అధికారులు గాలికి వదిలేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ నుంచి జైనథ్ మండలం పిప్పర్వాడ వరకు రోడ్డులో నిర్మాణ లోపాల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల జైనథ్ మండలం భోరజ్ చెక్పోస్టు సమీపంలో వరుసగా మూడు రోజులు ప్రమాదాలు జరుగగా, ముగ్గురు చనిపోయారు. రోడ్డుకు ఇరువైపులా అవసరమైన చోట సర్వీస్ రోడ్డులు, స్లీప్ రోడ్డులు, అండర్పాస్ల నిర్మాణం చేపట్టలేదు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు గతంలో పలుమార్లు నేషనల్ హైవే అథారిటీ అధికారులను కోరినా ఫలితం లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని జాతీయ రహదారిపై జందాపూర్ ఎక్స్రోడ్, మావల క్రాసింగ్, భోరజ్ చెక్పోస్టు, మావల మూలమలుపు, దేవాపూర్ క్రాసింగ్, గుడిహత్నూర్ బస్టాండ్ ఏరియా, గాంధీనగర్, ఉట్నూర్ క్రాస్రోడ్డు, సీతాగోంది ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని అధికారులు బ్లాక్ స్పాట్లుగా గుర్తించినా. ఎలాంటి చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. చార్జీలు పెంచడంపై ఉన్న శ్రద్ధ రహదారి బాగుపై లేకపోవడం శోచనీయమని ప్రజలు, వాహనదారులు మండిపడుతున్నారు.
దిలావర్పూర్ సమీపంలో..
దిలావర్పూర్, మార్చి 31: జాతీయ రహదారులపై ప్రస్తుతమున్న టోల్ చార్జీలపై మరో 5 శాతం కేంద్రం పెంచింది. నిర్మల్ భైంసా 61వ జాతీయ రహదారిపై దిలావర్పూర్ సమీపంలో ఉన్న టోల్గేట్ నుంచి నిత్యం వందల సంఖ్యలో కార్లు, బస్సులు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులపై మరింత భారం పెరగనున్నది. దిలావర్పూర్ టోల్ గేట్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నిత్యం రూ.2. 38లక్షలను టోల్ నిర్వాహకులు చెల్లిస్తారు. ఇప్పుడు ఇది రెట్టింపు కానుంది. రహదారిపై ఎలాంటి నాణ్యతా చర్యలు తీసుకోకున్నా, వేగాన్ని గుర్తించే సూచిక బోర్డులు ఏర్పాటు చేయకున్నా, టోల్ చార్జీలు పెంచుతూ పోతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చార్జీల పెంపుతో మరింత భారం
నేను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు సరుకులు రవాణా చేస్తుంటా. ఇప్పటికే పెరిగిన డీజిల్ ధరలతో ఇబ్బందులు పడుతున్నాం. జాతీయ రహదారిపై టోల్ప్లాజాల చార్జీలు పెంచడంతో మాపై మరింత భారం పడుతుంది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఐదు టోల్ప్లాజాలు ఉంటాయి. రూ.1500 టోల్కే కట్టాల్సి వస్తున్నది. పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలి.
-కుమార్, వాహనదారుడు, ఆదిలాబాద్
పోయినేడే పెంచిన్రు..
టోల్ప్లాజాల ధరలు పోయినేడు కూడా పెంచిన్రు. ఇలా ప్రతి ఏడాది ధరలు పెంచుకుంటూ పోతే మేమేట్ల బతుకుడు. ఇప్పటికే డీజిల్ ధరలు బాగా పెరిగినయ్. డీజిల్, టోల్ ప్లాజా చార్జీలు పెంచుకుంటూ పోతే మేం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. నేషనల్ హైవే అధికారులు రోడ్ల గురించి పట్టించుకోకుండా చార్జీలు మాత్రం పెంచుకుంటూ పోతున్నరు.
–సత్యజిత్నాథ్, వాహనదారుడు