కార్మికులకు ఒరగ బెట్టిందేమీ లేదు
టీబీజీకేఎస్తోనే హక్కుల పరిరక్షణ
సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి
యైటింక్లయిన్ కాలనీ మే 20 : సింగరేణిలో అసత్యపు ప్రచారాలు చేస్తూ జాతీయ సంఘాలు పబ్బం గడుపుకుంటున్నాయని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి విమర్శించారు. ఆర్జీ-2 ఏరియా ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం ఓసీపీ-3 కృషి భవన్లో జరిగిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ముందుగా మహిళా కార్మికులు, ఇతర యూనియన్ల నుంచి సంఘంలో చేరిన 50 మందికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సింగరేణిలో జాతీయ సంఘాల తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా ఉందని ఎద్దేవా చేశారు. మూడేళ్లుగా సింగరేణిలో కార్మిక వర్గానికి ఎన్నో హక్కులు సాధించి పెట్టామని, ఐదు జాతీయ సంఘాలు మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూ ప్రచారం చేసుకుంటున్నాయే తప్ప వారు చేసింది ఏమీ లేదన్నారు. ఆ సంఘాలు సింగరేణిలో 14 ఏండ్ల పాటు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా ఉండి సాధించిన దానికంటే పోగొట్టిన హక్కులే అధికమని గుర్తు చేశారు. దీనికి నిదర్శనమే సింగరేణి బొగ్గు కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపే వారసత్వ ఉద్యోగాల రద్దుపై సంతకం చేయడమేనని పేర్కొన్నారు. చేసిన తప్పులను ఒప్పుకోకపోగా.. తప్పుడు విమర్శలు చేస్తూ కార్మికుల మధ్య ఆ సంఘాలు చులకన అవుతున్నాయన్నారు.
ఈ సంఘాల నిర్వాకం వల్ల ఆలస్యమైనా 400 డిపెండెంట్ ఉద్యోగాలను ఇప్పించడం నిజం కాదా? అని ప్రశ్నించారు. రూ.20 లక్షల మ్యాచింగ్ గ్రాంట్, రెండు అదనపు పీహెచ్డీలు, ఒక శాతం విద్యుత్ కోత రద్దు, క్వార్టర్లలో ఏసీ సౌకర్యం, కార్మిక కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం తదితర 20కి పైగా కోల్ ఇండియాలోని హక్కులను సింగరేణిలో అమలు పరిచిన ఘనత తమదేన్నారు. ఈ సంఘాల అసమర్థత వల్ల కేంద్ర ప్రభుత్వం 200 పైగా బొగ్గు బ్లాకులను ప్రైవేట్పరం చేసేందుకు సర్వం సిద్ధం చేసిందని తెలిపారు. ఈ సంఘాలు కార్మికులకు చేయాల్సిన పనులు చేయకుండా టీబీజీకేఎస్ అమలు చేస్తున్న హక్కులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయే తప్ప మరొకటి కాదని విమర్శించారు. జాతీయ సంఘాల తప్పుడు ఆరోపణలు కార్మిక వర్గం గమనిస్తున్నదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆ సంఘాలకు మరోమారు ఓటమి తప్పదని జ్యోసం చెప్పారు. నాయకులు దేవ వెంకటేశం, కొత్త సత్యనారాయణరెడ్డి, బదావత్ శంకర్నాయక్, బేతి చంద్రయ్య, ఎట్టెం కృష్ణ, చెరుకు ప్రభాకర్రెడ్డి, నాచగోని దశరథం గౌడ్, కర్క శ్రీనివాస్, ఐ సత్యం, మామిడి తిరుపతి, గట్టయ్య, సంజీవయ్య, రాజమౌళి, చంద్రమౌళి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.