మంచిర్యాల, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఉన్నన్నీ రోజులు ఆయన్నీ తట్టుకునే శక్తి ఎవరికీ లేదు. కాంగ్రెస్, బీజేపీల పరేషాన్ అదే. సీఎం కేసీఆర్ రాజకీయ చతురత కింద ఎవరు పని చేయరు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు సీఎం కేసీఆర్ వదిలిన బుల్లెట్లు. వాళ్లను తట్టుకొని నిలబడే శక్తి ఎవరికీ లేదు. రాష్ట్రంలో మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే. నేను బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నా. నాపై నమ్మకం, బీఆర్ఎస్ పార్టీపై ప్రేమ ఉన్న బెల్లంపల్లి ప్రజలే నన్ను ఆశీర్వదిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే ఓట్లు పడుతయ్. ధర్మయుద్ధంలో నన్ను ఎదుర్కొనే సత్తా లేక శిఖండి రాజకీయాలు చేస్తున్నరు. ఎలాగైనా నన్ను ఓడించాలని ప్రతిపక్ష నాయకులు చేస్తున్న కుట్రలు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాజకీయ లబ్ధి కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం నాపై ఆరోపణలు చేస్తున్నారని బెల్లంపల్లి ప్రజలు, ఆడబిడ్డలే చెబుతున్నరు. నేను ఏ తప్పు చేయలేదని ప్రజలు నమ్మారు. అందుకే కేసీఆర్ టికెట్ మళ్లీ నాకే ఇచ్చారు. ఈ విషయంలో ఇదే నా గెలుపు. ఎవరెన్నీ కుట్రలు, జిమ్మిక్కులు చేసినా భారీ మెజార్టీతో గెలుస్తా.. నాపై గురిపెట్టి వదిలిన తుపాకీ గుండును మళ్లీ అటువైపే తిప్పుతా.. గడిచిన కొన్నేండ్లలోనే బెల్లంపల్లిలో అనేక అభివృద్ధి పనులు చేశాం. రానున్న ఐదేళ్లలో బెల్లంపల్లిని బంగారు తునక చేసి చూపిస్తాం. ఎడ్యుకేషన్, ఐటీ, ఇండస్ట్రీయల్ హబ్స్గా బెల్లంపల్లిని మారుస్తాం’ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి టికెట్ దక్కించుకున్న ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే : ఈ ఎన్నికల్లో మీ నినాదం ఏంటీ? ఏం చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిస్తారు?
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య : దేశంలోని ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలు, ఎవరూ చేయని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారు. అదే మా ఎన్నికల నినాదం. దానితోనే ముందుకుపోతాం. అవి చూసే ఈసారి మాకు ఓట్లు పడుతయ్. ఎవరూ ఇన్ని సంక్షేమ పథకాలు చేయలేదు. కేసీఆర్ సంక్షేమ పథకాలతోనే ఓట్లు పడుతయ్. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మరు. ఎందుకంటే తెలంగాణలో ఏం చేయాలన్నా సీఎం కేసీఆర్ నేరుగా చేయగలరు. ఆయన నోట్లో నుంచి వచ్చిందంటే జీవో వస్తది. అదే కాంగ్రెస్, బీజేపీలతో అది సాధ్యం కాదు. వారు ఏం చేయాలన్న ఢిల్లీ పెద్దలు పచ్చజెండా ఊపాలి. ఇక్కడ పింఛన్ పెంచుతామని ఒకరు అంటరు.. ఇక్కడ పెంచితే ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల ప్రజలు ఊరుకుంటారా.. గల్లా పట్టి అడుగుతరు. అందుకే ఎన్నికల్లో లబ్ధి కోసం తప్ప వారు చెప్పేవేమీ సాధ్యం కాదు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయి. వాటితోనే దేశంలోని ఇతర రాష్ర్టాల వారు బీఆర్ఎస్ పార్టీ వారి రాష్ర్టానికి రావాలని రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నరు. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఈసారి బీఆర్ఎస్దే హవా. ప్రజలు మాకే ఎందుకు ఓటు వేయాలంటే.. కేసీఆర్ ప్రభుత్వం ఇంకా కలకాలం ఉండాలి కాబట్టి మాకు ఓటు వేయాలి. దయాగుణం ఉన్న కేసీఆర్తోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు వంటివి సాధ్యమవుతున్నాయి.
నమస్తే : మీరు చేసిన అభివృద్ధి పనులు.. మీ మాటల్లో?
చిన్నయ్య : ఇప్పటివరకు చరిత్రలో ఎవరూ చేయలేదు. ఒక్క భీమిని మండలంలోనే గడిచిన ఎనిమిదేళ్లలో 18 బ్రిడ్జిలు కట్టినం. నా నియోజకవర్గంలో ఈ రోజు ఏ ఊరుకు పోయిన బీటీ రోడ్లు ఉన్నయ్. మారుమూల ఒకటి, రెండు గ్రామాల్లో తప్ప ప్రతి ఊరుకు డాంబర్ రోడ్డు వేసినం. ప్రతి మండల హెడ్ క్వార్టర్కి డబుల్ రోడ్ వేసినం. చీకటిమయంలో ఉన్న బెల్లంపల్లి టౌన్లోని రెండు ఫ్లై ఓవర్ల మీద లైట్లు పెట్టించినం. గ్రౌండ్స్లో లైటింగ్ పెట్టినం. రెండు పార్క్లు అభివృద్ధి చేసినం. అస్తవ్యస్తంగా ఉన్న పోచమ్మ చెరువు దగ్గర ఘోరమైన పరిస్థితి. ఆత్మహత్యలు, హత్యలు జరిగేవి. రూ.3 కోట్లతో బ్రహ్మాండంగా మినీ ట్యాంక్ బండ్ చేసినం. ఓపెన్ జిమ్లు పెట్టినం. వంద పడకల ఆసుపత్రి చేసినం. అక్కడే డయాలసిస్ చేస్తున్నరు. మా బెల్లంపల్లిలో డయాలసిస్ పేషంట్లు ఎక్కువ. వారంతా ఈ రోజు హ్యాపీగా ఉన్నరు. గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు ఒక్క ఊరుకు రోడ్డు వేయలే. కానీ.. మేం వేసినం. నెన్నెల, కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి లాంటి మారుమూల మండలాల్లో మొత్తం రోడ్లు చేసినం. వేమనపల్లిలో నీల్వాయి బ్రిడ్జి 30 గ్రామాలను కలుపుతది. అక్కడ బ్రిడ్జి లేక పడవల మీద పోయేటోళ్లు. డెలివరీ కోసం అక్కడి దాకా వచ్చి వాగుదాటేందుకు ఇబ్బందులు పడేటోళ్లు. అలాంటి దగ్గర రూ.8 కోట్లతో బ్రిడ్జి కట్టించినం. ఇలాంటి దీర్ఘకాలికమైన సమస్యలను ఎన్నింటినో బీఆర్ఎస్ హయాంలో పరిష్కరించాం. ఇది నేను ధైర్యంగా, చాలెంజ్ చేసి చెప్తున్నా. ఇవన్నీ కూడా కండ్ల ముందు కనిపిస్తున్న సత్యాలు. 50 ఏళ్లలో ఎవరూ ఊహించలే సింగరేణి పట్టాలు వస్తయని. కానీ.. అది మేము చేసి చూపించాం.
నమస్తే : మళ్లీ గెలిస్తే బెల్లంపల్లి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేద్దామనుకుంటున్నారు? మీ దగ్గర అభివృద్ధి ప్రణాళిక ఏమైనా ఉందా?
చిన్నయ్య : మా నియోజకవర్గంలో ప్రతి మండలం మారుమూల ప్రాంతాలే. అక్కడ ఉన్న వారంతా పేద, దిగువ మధ్య తరగతి బిడ్డలే. ఆడపిల్లలను పదో తరగతి వరకు చదివించి పట్నానికి పంపలేక డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దాన్ని అపేందుకు కృషి చేస్తా. రాబోయే కాలంలో ఎడ్యుకేషన్ విషయంలో బెల్లంపల్లిని టాప్ చేయాలనేది నా ఆలోచన. అందుకే బాగా చదువుకునే విద్యార్థి ఎవరు నా ఇంటికి వచ్చినా నేను ఆర్థికంగా సాయం చేస్తుంటా. ఇవాళ కూడా ఒక పిలగాడు ఎంబీబీఎస్ పాస్ అయ్యా. నాకు ఆర్థిక సాయం కావాలని వచ్చాడు. తక్షణ ఆర్థిక సాయం అందించి, ఆ పిల్లోడి ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అయితే అంత ఇవ్వమని కలెక్టర్కు చెప్పిన. చేపిస్తా. బెల్లంపల్లికి నా హయాంలో ఏడు రెసిడెన్షియల్ స్కూళ్లను తెచ్చుకున్నా. డిగ్రీ కాలేజీలో 150 మంది పిల్లలు ఉంటే ఈ రోజు 900 మందిని చేసుకున్నాం. అంతకుముందు జూనియర్ కాలేజీలకు బిల్డింగ్లు లేకుంటే రూ.10 కోట్లతో కాలేజీ కట్టించినం. ఈ రోజు అన్ని కులాల ఆడపిల్లలు అక్కడ చదువుతున్నారు. గర్ల్స్ జూనియర్ కాలేజీ దగ్గర రూ.2 కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో ఒక హాస్టల్ కట్టించినం. డిగ్రీ కాలేజీలోని 300 మంది పిల్లలకు హాస్టల్ బిల్డింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. అది వస్తే ఆడపిల్లలు ఇగ బయటికి వెళ్లకుండా చదువుకోవచ్చు. ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఉమ్మడి జిల్లాలో ఒక ఇంజినీరింగ్ కాలేజీ కావాలి అది బెల్లంపల్లిలో పెట్టడానికి కృషి చేస్తాం. బెల్లంపల్లిలో కేవీకే 50 నుంచి 60 ఎకరాల్లో ఉన్నది. పది మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. అక్కడ ఒక అగ్రికల్చర్ కాలేజీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అది తప్పకుండా నేను సాధిస్తా. బెల్లంపల్లిని ఎడ్యుకేషన్ హబ్ చేసి చూపిస్తా.
నమస్తే : మీ మీద వస్తున్న ఆరోపణలు, వాటికి మీ సమాధానం ఏంటీ?
చిన్నయ్య : మా ప్రాంతంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసిన. రైతులకు మనం అండగా ఉన్నాం. దానికి వాళ్లు లేనిపోని అభాండాలు, ఆరోపణలు చేస్తూ ఆ నెపాన్ని నా మీద దొబ్బడానికి ప్రయత్నం చేస్తున్నరు. రైతులకు ఎక్కడ డబ్బులు కట్టాల్సి వస్తదో అన్న ఉద్దేశంతో వాళ్లు తప్పించుకోవడానికి ఈ ఎత్తుగడలు వేస్తున్నారు. ధర్మయుద్ధంలో నన్ను ఎదుర్కొనే శక్తి లేక అధర్మ మార్గంలో శిఖండి రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొందుతున్నారు. వ్యక్తిగత స్వార్థం చూసుకుంటున్నరు తప్ప.. వేరే ఏం లేదు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఆడబిడ్డలే దీనికి సమాధానం చెప్తారు. మా ఎమ్మెల్యే తప్పు చేయలేదు అని ప్రజలే చెబుతున్నరు. నా మీద ప్రజలు మంచి అభిప్రాయంతో ఉన్నారు కాబట్టే సీఎం కేసీఆర్ నాకు టికెట్ ఇచ్చారు. మా ఎమ్మెల్యే తప్పు చేయలేదని కేటీఆర్ గారే చెప్పారు. కావాలంటే ఎంక్వైరీ చేయండి అని కూడా అన్నారు. కావాలనే నా మీద అపనింద వేస్తున్నరు. ఇప్పుడు నాకు టికెట్ రాకపోయి ఉంటే ప్రజలు ఏం అనుకుంటారు. నిజమే కావచ్చు కేసీఆర్ కూడా నమ్మిండు కాబట్టే టికెట్ ఇవ్వలేదు అనుకుంటరు. నేను తప్పు చేయలేదని ప్రజలే చెప్పారు కాబట్టే నాకు టికెట్ వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అన్ని విషయాలు తెలుసు. ఒక ఎమ్మెల్యే సీటు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓ పార్టీ అధినేత ఊరికే నిర్ణయం తీసుకుంటారా.. ప్రజలకు ఏం అవసరమో తెలుసుకొని నాకు అవకాశం ఇచ్చారు.
నమస్తే : ఇండస్ట్రీయల్, ఐటీ పరంగా ఎలాంటి అభివృద్ధి ప్లాన్ చేస్తున్నారు?
చిన్నయ్య : కేటీఆర్ ఆశీర్వాదంతో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ పెట్టాం. 27 కంపెనీలు రానున్నాయి. ఇంకా 350 ఎకరాల్లో ఏ కంపెనీ ముందుకొచ్చినా అనుమతులు ఇస్తాం. ఐటీ కంపెనీల కోసం మరో 100 ఎకరాలు సేకరిస్తున్నాం. కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇక్కడ ఒక హబ్ పెడుతాం. ఇప్పుడున్న రెండు కంపెనీలకు ఇక్కడికి వస్తాయి. ఆటో మొబైల్స్కు సంబంధించి మెగా ప్లాంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు నడుస్తున్నాయి. ఇటు నాగపూర్కు అటు హైదరాబాద్కు బెల్లంపల్లి సెంటర్ పాయింట్. కాకినాడ ఫోర్ట్కు కూడా మంచిర్యాల నుంచి వరంగల్, విజయవాడ మీదుగా మన రోడ్డు లింక్ అవుతున్నది. ఐదేళ్లలో ఎవరూ ఊహించని స్థాయిలో డెవలప్ అవుతది. ఒక్క మాటలో చెప్పాలంటే రానున్న ఐదేళ్లలో బెల్లంపల్లి బంగారు తునక అవుతది.
నమస్తే : 50 వేల మెజార్టీ వస్తుందని అంతా ధీమాగా ఎలా చెప్తున్నారు?
చిన్నయ్య : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి నాకు అవకాశం కల్పించింది. ఆ మరునాడు నేను హైదరాబాద్ నుంచి బెల్లంపల్లికి వచ్చా. నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా 10 వేల మంది నాకు స్వాగతం పలకడానికి వచ్చారు. మందమర్రి టోల్గేట్ నుంచి చూస్తే ైఫ్లైఓవర్ వరకు జనం తప్ప ఇంకేం కనిపించలేదు. నేను ఆశ్చర్యపోయా.. అది చూసే చెప్తున్నా. రేపు 50 వేల ఓట్ల మెజార్టీకి తగ్గకుండా నేను గెలుస్తున్నా.. ఇప్పటికే నాకు క్యాంప్ ఆఫీసులో జాతర నడస్తున్నది. 200 మంది, 300 మంది గ్రూపు గ్రూపులుగా వచ్చి కలుస్తున్నారు. నా మీద నమ్మకం, బీఆర్ఎస్ మీద ప్రేమ ఉన్నది కాబట్టే జనం నాకోసం వస్తున్నరు. అవతలి వాళ్లు ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలిచేది నేనే. వాళ్లు నాపై గురిపెట్టి వదిలిన తుపాకీ గుండును మళ్లీ వారి వైపే తిప్పి చూపిస్తా. నా గుండెలో ఉంది జనం.. దాన్ని అంత సులభంగా ఎవరూ తాకలేరు.