రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించి.. మా అధినేత కేసీఆర్కు కానుకగా ఇస్తానని ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
నమస్తే : మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది?
కోవ లక్ష్మి : మాది తిర్యాణి మండలం మారుమూల గ్రామం పంగిడి మాదార. నాకు ఊహ తెలిసే సమయానికి మా నాన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. చిన్నప్పటి నుంచి మా నాన్నను చూస్తూ పెరిగా. క్రమంగా రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. 1995లో టీడీపీ నుంచి తిర్యాణి మండలంలోని పండిగి మాదార నుంచి మొదటిసారిగా సర్పంచ్గా ఎన్నికయ్యా. ఆ తర్వాత ఎంపీటీసీగా గెలిచి 2001లో తిర్యాణి మండల ఎంపీపీగా సేవలు అందించా. 2006లో ఆసిఫాబాద్ సర్పంచ్గా గెలిచా. తెలంగాణ ఉద్యమ సమయంలో టీ(బీ)ఆర్ఎస్లో చేరా. 2013లోనూ ఆసిఫాబాద్ సర్పంచ్గా గెలిచా. 2014లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలిచా. 2018లో కేవలం 171 ఓట్ల తేడాతో ఓటమి చెందా. నా రాజకీయ జీవితంలో ఇదే మొదటిసారి. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ నుంచి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం అవకాశం కల్పించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఏకైక మహిళా అభ్యర్థిని నేనే.
నమస్తే : రాజకీయాల్లో మీకు స్ఫూర్తి ఎవరు?
కోవ లక్ష్మి: రాజకీయాల్లో నాన్న కోట్నాక్ భీంరావే నాకు స్ఫూర్తి. ఆయనను చూస్తూ పెరిగా. రాజకీయాలు సహజంగానే నాకు అలవడ్డాయి. 1995లో తొలిసారి సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుంచే ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా పనిచేస్తూ వస్తున్నా. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగా. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకొని ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్పర్సన్గా నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నా. నాపై ఉన్న నమ్మకంతో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని.. సీఎం కేసీఆర్ సార్ నాకు మరోసారి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. ప్రజలే నా దేవుళ్లు.. రాబోయే ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకముంది.
నమస్తే : ఇప్పటి వరకు ఎన్నిసార్లు విజయం సాధించారు?
కోవ లక్ష్మి: నేను దాదాపు 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎనిమిదిసార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. ఏడుసార్లు విజయం సాధించాను. తిర్యాణి మండలంలోని మారుమూల గ్రామం పంగిడి మాదార సర్పంచ్గా నా రాజకీయ జీవితం మొదలైంది. నా సేవలకు గుర్తింపుగా ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ విజయాన్ని అందిస్తున్నారు. 2018 ఎన్నికల్లో కేవలం 171 ఓట్ల తేడాతో మొదటి సారి ఓడిపోయాను. రెండు నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జడ్పీ చైర్పర్సన్గా అవకాశం కల్పించారు. ఇప్పుడు మళ్లీ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఇందుకు ఆయనకు రుణపడి ఉంటాను.
నమస్తే : వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి?
కోవ లక్ష్మి: ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా సేవలు అందిస్తే వారు ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారు. 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా నేను చేసిన సేవలు, చేస్తున్న సేవలు ప్రజలకు తెలుసు. ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలకు కోవ లక్ష్మి అంటే ఏమిటో తెలుసు. తప్పకుండా ప్రజల అండ నాకే ఉంటుంది. ప్రజల్లో నాకున్న ఆదరణ చూసే సీఎం కేసీఆర్ మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు. జడ్పీ చైర్పర్సన్గా నిత్యం ప్రజల మధ్యే ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఘన విజయం సాధిస్తా. సీఎం కేసీఆర్కు నా విజయాన్ని కానుకగా అందిస్తా.