ఇందారం పెట్రోల్ దాడి ఘటనలో గాయపడ్డ ప్రజాప్రతినిధుల ఆవేదన
జైపూర్, మే 20 : చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు స్వార్థ రాజకీయాలకు ఇందారం, రామరావుపేట గ్రామాలకు చెం దిన 14 మంది (9 కుటుంబాలు)మి తీవ్రంగా నష్టపోయామని, నికార్సయిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్త రేగుంట గట్టయ్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పలువురు బాధిత ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో 2018 ఎన్నికల సమయంలో సెప్టెంబర్ 12న పెట్రోల్ దాడి ఘటనలో గాయపడ్డ ప్రజాప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నల్లాల ఓదెలు స్వార్థ రాజకీయాలకు తమ కుటుంబాలు బలైనట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓదెలు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైనా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో ఓదెలు ఓటమి ఖాయమని తెలుసుకున్న అధిష్టానం అప్పటి ఎంపీ బాల్క సుమన్కు చెన్నూర్ టికెట్ కేటాయించడంతో బాల్క సుమన్పై దాడికి కుట్ర పన్నినట్లు వారు పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో టికెట్ బాల్క సుమన్కు కేటాయించారని, మొదటిసారి జిల్లాకు వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేస్తున్న క్రమంలో రేగుంట గట్టయ్య అనే కార్యకర్త ఓదెలుకు ఎమ్మెల్యే టికెట్ రాలేదని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడని, చికిత్స పొందుతూ పది రోజుల తర్వాత మృతి చెందినట్లు వారు తెలిపారు. తోపులాటలో అక్కడ ఉన్న మంగళహారతులు అంటుకుని మంటలు చెలరేగగా అప్పటి సర్పంచ్ జక్కుల గంగామణి, ఎంపీటీసీ సుంకరి విమల దంపతులు, రామరావుపేట ఎంపీటీసీ ముదాం రాజేశ్వరి దంపతులు, కార్యకర్తలు తొగరి శ్రీనివాస్, జైనుద్దీన్తో పాటు పలువురికి తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. గాయపడ్డ వారికి అప్పటి ఎంపీ బాల్క సుమన్ నేతృత్వంలో యశోద హస్పిటల్లో చికిత్స చేయించారని వివరించారు.
తీవ్రంగా గాయపడ్డ తమకు రూ. కోటి వెచ్చించి వైద్యం అందించారని, ఆర్థికంగా కూడా ఆదుకున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన ఓదెలు కనీసం తమను పరామర్శించేందుకు కూడా రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాల్క సుమన్ ముందు చూపు విజన్ ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఓదెలు కన్నతల్లి లాంటి పార్టీని వీడి అక్కసుతో బాల్క సుమన్ అన్నపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్మూరి అరవిందరావు, వైస్ ఎంపీపీ పెద్దపల్లి రమేశ్, కో ఆప్షన్ జైనొద్దీన్, నాయకులు మేడి తిరుపతి, గడ్డం ప్రసాద్గౌడ్, సుంకరి శ్రీనివాస్, జక్కుల వెంకటేశం, తొగరి శ్రీనివాస్, ముదాం రమేశ్, బడుగు రవి, చిప్పకుర్తి దుర్గయ్య, బో యిన సంపత్, తంగళ్లపల్లి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఓదెలు పదవుల మనిషి
చెన్నూర్ రూరల్, మే 20 : చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ప్రజల మనిషి కాదని, ఆయన పదవుల మనిషని చెన్నూర్ జడ్పీటీసీ మోతె తిరుపతి అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆయనను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే బుద్ధి బయట పడిందన్నారు. అధికార పార్టీలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నపుడు చేయని అభివృద్ధి.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి చేస్తావా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు దొంగ.. రేవంత్తో కలిసి నువ్వు కూడా దొంగవు అయినావని, నిన్ను ప్రజలు నమ్మరని, తల్లి లాంటి పార్టీని మోసం చేసావని తెలిపారు. ప్రభుత్వ విప్పై తప్పుడు ఆరోపణలు చేస్తే కార్యకర్తలు, నాయకులు ఎవరు ఊరుకోరని, తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.