ఇంద్రవెల్లి, డిసెంబర్12: నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య సోమవారం నవగ్రహ పూజలతోపాటు అష్టదీపల, ఘట్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కెస్లాపూర్ గ్రామం నుంచి నవధాన్యాలతోపాటు పూజా సామగ్రితో నాగోబా ఆలయానికి తరలివచ్చి పూజకు శ్రీకారం చుట్టారు. నవధాన్యాలతోపాటు నవగ్రహాలు ఏర్పాటు చేసి మధ్యలో ఘట్ను పెట్టి అష్టదీపాలు వెలిగించారు. వెంకట్రావ్పటేల్ దంపతులు దీపాలు వెలిగించి హారతితో వేదిక వద్ద పూజలు చేశారు. ఆదివాసీ గిరిజన వేదపండితులు ఆత్రం పురుషోత్తం, కొడప వినాయక్రావ్ల వేదమంత్రోచ్ఛరణల మధ్య నవగ్రహ పూజలు వైభవంగా చేశారు. ఆదివాసీ గిరిజన కులదేవతల ఆలయాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో ఆలయంతోపాటు నూతనంగా నిర్మించిన అన్ని చోట్ల చల్లారు. ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు నవగ్రహ పూజల్లో పాల్గొన్నారు.
ఐదు ప్రాంతాల నుంచి పవిత్ర జలం సేకరణ
నూతనంగా నాగోబా విగ్రహాన్ని ప్రతిష్ఠించే చోట ఆలయ శుద్ధి కోసం మెస్రం వంశీయులు ఐదు దేవస్థానాల నుంచి పవిత్ర జలాన్ని సేకరించారు. కెరమెరి మండలంలోని విద్యకస, జన్నారం మండలం లోని గోదావరి నది వద్ద గల హస్తలమడుగు, గుడిహత్నూర్ మండలంలోని పులికహచర్, బేల మండలంలోని పెండల్వాడ, ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ మర్రిచెట్ల కోనేరు నుంచి పవిత్ర జలాలను ఐదు మట్టికుండల్లో తీసుకొచ్చారు. ఈ పవిత్ర జలం గల కుండలను తెల్లని వస్త్రంతో కప్పి భద్రంగా ఉంచారు. 18వ తేదీన నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా పవిత్రమైన జలాలను బయటకు తీస్తారని మెస్రం వంశీయుల పెద్ద తెలిపారు.
200 మంది యూత్ సభ్యులు
వేడుకలను విజయవంతం చేయడానికి 200 మంది యువకులను వలంటీర్లుగా ఏర్పాటు చేశారు. వీరు ప్రతిరోజూ తెల్లని దుస్తులు ధరించి భక్తులకు, ప్రముఖులకు సేవలు అందించనున్నారు. ఆలయ ఆవరణలో లోతట్టు ప్రాంతాల్లో మట్టి వేసి గుంతలను పూడ్చారు. ఎడ్లబండికి రంగులు వేశారు. విద్యుద్దీపాల అలంకరణ పనులు చేస్తున్నారు. భక్తులకు తాగునీరు అందించనున్నారు. కాగా.. శుభకార్యాలు, పెండ్లిండ్లను బ్రహ్మణులు మాత్రమే చేస్తారు. కానీ.. మెస్రం వంశీయులు అలా కాకుండా వారి కులానికి చెందిన ఆదివాసీ గిరిజన వేద పండితులు నవగ్రహ పూజలు చేశారు.
ఏళ్లనాటి కల నెరవేరింది..
మెస్రం వంశీయుల ఏండ్ల నాటి కల నెరవేరింది. నాగోబా ఆలయం కొత్తగా సిద్ధమైంది. ప్రస్తుతం ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఆలయ పరిసరాల్లో వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర సర్కారే చేపడుతున్నది. ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న నాగోబాకు ఇక ఘన పూజలందించే అవకాశం దక్కింది. ప్రస్తుతం కట్టిన ఆలయం ఎంతో వైభవంగా ఉంది.
– మెస్రం దాదారావ్, ప్రర్ధాంజీ
రూ.6 కోట్లతో అభివృద్ధి పనులు
నాగోబా ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.6 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టింది. ఆలయం చుట్టూ ప్రకార మండపంతో పాటు 4 రాజగోపు రాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొత్త ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేసింది. ఆలయంలో పలు పనులు కొనసాగుతున్నాయి. జాతర ప్రారంభోత్సవానికి ముందుగా ఆలయంలో గ్రానైట్ ఫర్చిని ఏర్పాటు చేయాలి. కేస్లాపూర్ వద్ద కొత్త గేట్ను మంజూరు చేసింది.
– మెస్రం దేవ్రావ్, మెస్రం వంశీయుల ఉద్యోగ సంఘం ప్రధానకార్యదర్శి
ప్రత్యేక కృతజ్ఞతలు..
రాష్ట్ర ప్రభుత్వం నాగోబా ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టింది. మెస్రం వంశీయులతోపాటు భక్తులకు శాశ్వతమైన మౌళిక సదుపాయలు, వసతులు కల్పించారు. తాగునీటితోపాటు మరుగుదొడ్లు, స్నానపుగదులు, విద్యుత్ సౌకర్యాలు అందుబాటులో ఉంచింది. దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నది. నాగోబా ఆలయ అభివృద్ధికి కృషి చేసిన ప్రభుత్వానికి మెస్రం వంశీయుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. -మెస్రం శేఖర్బాబు, మెస్రం వంశీయుల ఉద్యోగ సంఘం కమిటీ సభ్యుడు
ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రాష్ట్ర ప్రభుత్వం నాగోబా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నది. ఆలయంలో రూ. 6 కోట్లతో వివిధ రకాల పనులు చేపడు తున్నది. గతంలో ఆలయ పరిసరాల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మెస్రం వంశీయులు ఎప్పటికీ మర్చిపోరు. మేమంతా కలిసి రూ. 4.67 కోట్ల విరాళాలు సేకరించి ఆలయం నిర్మించాం. ఆలయ నిర్మాణం పూర్తవడం చాలా సంతోషంగా ఉంది.
-మెస్రం వెంకట్రావ్పటేల్, మెస్రం వంశీయుల పీఠాధిపతి
గుర్తింపు వస్తుంది..
నాగోబా ఆలయాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. మా ఆరాధ్య దేవతకు మంచి ఆలయం ఉండాలనే మా కల ఇప్పటికీ నెరవేరింది. ఎంతో చరిత్ర గల నాగోబా ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించింది. ఆలయ ఆవరణలో మెస్రం వంశీయులతోపాటు భక్తులకు కొన్ని శాశ్వతమైన సదుపాయాలు కల్పించింది. మేం సేకరించిన విరాళాలతో ఆలయాన్ని నిర్మించుకున్నాం. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -మెస్రం కోసు కటోడ, సాలేవాడ
తండ్రి నుంచే వేదాలు నేర్చుకొని..
బోథ్ మండలంలోని గురుదేవ్నగర్కు చెందిన ఆత్రం పురుషోత్తం మహారాజ్ తన తండ్రి గంగానందస్వామి ద్వారా వేదాలు నేర్చుకున్నాడు. తండ్రి మృతిచెందిన తరువాత ఏడేండ్ల నుంచి వేదమంత్రాలు చదువుతున్నాడు. ప్రారంభోత్సవాలతో పాటు విగ్రహాల ఏర్పాటు, కర్మకాండలు, పిండప్రదానం, దోషాలు, గృహ ప్రవేశాలు, వాస్తు, పెండ్లిళ్లతోపాటు అన్ని రకాల పూజలు చేస్తున్నాడు.నేను ఆదివాసీ గిరిజనుడినై ఉండి వేదాలు చదవడం సంతోషంగా ఉందని చెబుతున్నాడు. – ఆత్రం పురుషోత్తం మహారాజ్, గురుదేవ్ నగర్, బోథ్.
పదేండ్ల నుంచి వేద పండితుడిగా..
నేను పదేండ్ల నుంచి ఆదివాసీ గిరిజన వేద పండితుడిగా సేవలు అందిస్తున్నా. నేను ప్రభుత్వ ఉపాధ్యా యుడిగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందా. బోథ్ మండలంలోని గురుదేవ్నగర్కు చెందిన ఆత్రం పురుషోత్తం మహారాజ్ వద్ద వేదాలు నేర్చుకున్నా. ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఏదైనా కార్యక్రమాలు ఉంటే చేస్తా. వేదమంత్రోచ్ఛరణలతోపాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా బోధిస్తా.
– కొడప వినాయక్ మహారాజ్, పిప్రి, ఇంద్రవెల్లి.
శాశ్వత సౌకర్యాలు కల్పించింది..
మెస్రం వంశీయులతోపాటు భక్తులకు అన్ని రకాల శాశ్వతమైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. ముత్నూర్ నుంచి డబుల్ బీటీ రోడ్డు గతంలోనే నిర్మించింది. ముత్నూర్ గ్రామంలో ఆర్చిగేట్ను ఏర్పాటు చేసింది. తాగునీటి కోసం ఆలయ పరిసరాల్లో ట్యాంకులు అందుబాటులోకి తెచ్చింది. దర్భార్ హాల్ మంజూరు చేసి నిర్మాణం చేపట్టింది. ఆలయ ఆవరణలో సీసీరోడ్డును నిర్మించింది. మెస్రం వంశీయులకు రాష్ట్రం పూర్తిగా సహకరిస్తున్నది. -మెస్రం నాగ్నాథ్, కేస్లాపూర్ మాజీ సర్పంచ్
మా వంశీయుల కృషి వల్లే..
మా వంశీయుల కృషి వల్లే ఆలయం కొత్త వైభవం సంతరించుకుంది. రాష్ట్ర సర్కారు కూడా సహకరించింది. ఆలయ ప్రాంగణంలో వివిధ అభివృద్ధి పనులను సర్కారే నిర్వహిస్తున్నది. అడవి బిడ్డలకు నాగోబా ఆరాధ్య దైవమని సర్కారు గుర్తించింది. అందుకే నిధులు మంజూరు చేసి, వివిధ పనులు చేపడుతున్నది. మరింత సహకరిస్తే మిగతా పనులు పూర్తవుతాయి. ప్రారంభోత్సవ వేడుకలను ఎంతో సంతోషంగా నిర్వహిస్తున్నాం. -మెస్రం షేకు, ఆలయ పూజారి
నాగోబాకు సరికొత్త శోభ
ఆలయ నిర్మాణం పూర్తవడంతో ఈ ప్రాంతానికి సరికొత్త శోభ వచ్చింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న వేడుకలు సంప్రదాయరీతిలో కొనసాగుతున్నాయి. కృష్ణ శిలలతో కట్టిన ఆలయం సూడచక్కగా ఉంది. మెస్రం వంశీయులమంతా విరాళాలు పోగు చేసి ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాం. ఆలయ ప్రాంగణంలో వివిధ పనులకు రాష్ట్ర సర్కారు సహకరిస్తున్నది. పనులన్నీ పూర్తయితే ఈ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. -మెస్రం తిరుపతి-కోత్వాల్
సంతోషంగా ఉంది..
రాష్ట్ర ప్రభుత్వం నాగోబా ఆలయంలో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. రూ. 6 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూ.6 కోట్లు సరిపోవడం లేదు, అదనంగా నిధులు మంజూరు చేసేందుకు కృషి చేయాలి. కొత్త నాగోబా ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉంది.
-మెస్రం సోనేరావ్, మెస్రం వంశీయుల ఉద్యోగ సంఘం అధ్యక్షుడు