ఇంద్రవెల్లి, జనవరి 21 : ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన ఇంద్రవెల్లి మండలంలోని ఆదివాసీ గిరిజన గ్రామం కేస్లాపూర్లో నాగోబా జాతర ప్రారంభమైంది. మెస్రం వంశీయులు శనివారం అర్ధరాత్రి నిర్వహించిన సంప్రదాయ మహాపూజలతో జాతరకు అంకుర్పారణ జరిగింది. ఈ జాతర అధికారికంగా ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనున్నది. మహాపూజలకు ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన మెస్రం వంశీయులతోపాటు ఆదివాసీ గిరిజన భక్తజనంతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఆవరణతోపాటు పరిసరాల ప్రాంతంలో ఎటుచూసినా జనమే కనిపించింది. మెస్రం వంశీయులు నాగోబా మహాపూజలకు ఉదయం 11 గంటల నుంచి శ్రీకారం చుట్టగా, అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగించారు. అనంతరం ఇతరులను అనుమతించారు.
పురాతన ఆలయంలో ప్రత్యేక పూజలు
పవిత్ర గంగాజలంతో నాలుగు రోజులుగా మర్రిచెట్లవద్ద బసచేసిన మెస్రం వంశీయులు ముందుగా కేస్లాపూర్ గ్రామంలోని పురాతన(మురాడి) నాగోబా ఆలయానికి చేరుకున్నారు. పురాతన నాగోబా విగ్రహంతోపాటు వెలిగించిన దీపాలను వెదురుబుట్టల్లో పెట్టి భారీ శోభాయాత్రగా నాగోబా ఆలయానికి బయల్దేరారు. కేస్లాపూర్ గ్రామం నుంచి పురాతన నాగోబా విగ్రహంతో వచ్చిన మెస్రం వంశీయ పటేళ్లను మర్రిచెట్లవద్ద బసచేస్తున్న మెస్రం వంశీయులు సంప్రదాయ వాయిద్యాలతో ఘనంగా స్వాగతించారు. అక్కడి నుంచి వారందరూ కలిసికట్టుగా భాజాభజంత్రీలతో నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం ముందున్న మైసమ్మ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. పురాతన నాగోబా విగ్రహాలతోపాటు నాగోబా, సతీ, బాన్దేవతలకు సంప్రదాయ పూజలు చేశారు. గ్రామం నుంచి తీసుకొచ్చిన పురాతన నాగోబా విగ్రహాన్ని గర్భగుడిలోని నాగోబా విగ్రహం వద్ద ఉంచారు. అనంతరం ఆలయం పక్కన మెస్రం వంశీయుల పెద్దలు సంప్రదాయ పద్ధతిలో కూర్చొని ఒకరినొకరు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆలయం వెనుకున్న బాన్దేవతలతోపాటు పెర్సపేన్ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి తిరిగి నాగోబా ఆలయానికి వచ్చారు.
గోవాడ్లోకి మహిళలకు ప్రవేశం
మర్రిచెట్ల నుంచి మెస్రం వంశీయులు ఎడ్లబండ్లతో కుటుంబ సమేతంగా నాగోబా ఆలయానికి చేరుకోగా, మహిళలకు గోవాడ్లో ప్రవేశం కల్పించారు. గోవాడ్ చుట్టూ తమ ఎడ్లబండ్లను వదిలి ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసుకొని బసచేస్తున్నారు. గోవాడ్లో మహిళలు 22 ప్రత్యేక పొయ్యిలను ఏర్పాటు చేసుకొని మహాపూజలకు అవసరమైన నైవేద్యాన్ని సామూహికంగా తయారు చేశారు. మెస్రం వంశ సంప్రదాయం ప్రకారం మహాపూజలకు అరగంట ముందు నాగోబా ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మెస్రం వంశీయులు గోవాడ్ నుంచి వెలిగించిన కాగడాలను చేతిలో పట్టుకొని సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 12 గంటల వరకు మెస్రం వంశీయులే నాగోబాకు మహాపూజలు చేయగా, ఈ సమయంలో ఇతరులను లోనికి రానివ్వకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. పూజల అనంతరం వచ్చిన అతిథులతోపాటు ఇతరులను నాగోబాకు పూజలు చేసే అవకాశం కాల్పించారు.
22 కితలకు మట్టికుండల పంపిణీ
నాగోబా ఆలయం వెనుక ఉంచిన మట్టికుండలను 22 కితలకు చెందిన మహిళలకు మెస్రం వంశ పెద్దల చేతుల మీదుగా పంపిణీ చేశారు. కుండలకు కోటోడ కోసేరావ్, కోసు కటోడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 22 కితలకు చెందిన ఆడ పడుచులు(మహిళలు) మర్రిచెట్లవద్దకు చేరుకొని పురాతన బావి(నీటికోనేరు)కి చేరుకున్నారు. నీటి కోనేరుకు సంప్రదాయ ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయుల అల్లుళ్లు నీటికోనేరు ద్వారా నీటిని తోడి మట్టికుండల్లో నింపారు. ఆ కుండలను మహిళలు తలపై పెట్టుకొని వరుసగా నాగోబా ఆలయానికి చేరుకున్నారు. నాగోబా ఆలయంలోని పాత పాముల పుట్టలను అల్లుళ్లు తవ్వి తొలగించారు. అదే మట్టిని మహిళలు తెచ్చిన నీటితో అల్లుళ్లు బురదమట్టి చేసిచ్చారు. మహిళలందరూ కలిసి ఆ మట్టితో పాముల పుట్టలను తయారు చేశారు. అదే మట్టితో మరికొంత మహిళలు నాగోబా ఆలయంలో బౌల దేవతను తయారు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. బౌల దేవత పూజల్లో పాల్గొన్న మహిళలు, మెస్రం వంశీయులకు నాగోబా చరిత్రను మెస్రం గంగారాం, రాము కిక్రి వాయిస్తూ పాటల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, బాజీరావ్పటేల్, లింబారావ్పటేల్, జంగుపటేల్, కటోడ కోసు, కటోడ కోసేరావ్, పర్ధాంజీ మెస్రం దాదారావ్, నాగోబా పేన్ కొత్వాల్ మెస్రం తిరుపతి, నాయిక్వాడీ ధర్ము, మెస్రం వంశీయులు మనోహర్, దేవ్రావ్, సోనేరావ్, నాగ్నాథ్, శేఖర్బాబు, తుకారాం, ఆనంద్రావ్, ఆలయ పూజారి మెస్రం షేకు, గణపతి, మారుతి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల అతి పెద్ద దేవుడు నాగోబా
దక్షిణ భారతదేశంలోని మెస్రం వంశీయుల్లోని గిరిజనులకు అతిపెద్ద దేవుడు కేస్లాపూర్ నాగోబానే. వారిళ్లలో కొత్త కోడళ్లను నాగోబాకు పరిచయం(బేటింగ్)చేయడం వీరి ఆచారం. ఈ పూజలు చేసే వరకు ఆ కోడళ్లకు ఇంట్లో దే వుళ్లను కూడా మొక్కే అర్హత ఉండదు. నాగోబాకు పరిచయం చేసిన తర్వాతే వారిని మెస్రం వంశంలోకి ఆహ్వానిస్తారు. ఈ మొక్కులు చెల్లించుకునేందుకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ర్టాలకు చెం దిన మెస్రం వంశీయులంతా తరలివచ్చారు. తమ కుటుంబాలతో కలిసి చేరుకున్నారు.
కేస్లాపూర్కు తరలివస్తున్న అడవిబిడ్డలు
తమ ఆరాధ్యదైవాన్ని దర్శించుకునేందుకు భక్తులతో పాటు గిరిజనులు తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి మెస్రం వంశీయులు, గిరిజనులు పెద్దసంఖ్యలో కేస్లాపూర్ చేరుకున్నారు. వారంరోజుల పాటు ఇక్కడే ఉండేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో కేస్లాపూర్ ప్రజలతో కోలాహలంగా మారింది. జాతరలో వివిధ రకాల దుకాణాలు, రంగుల రాట్నాలు ఏర్పాటు చేయడంతో సందడి నెలకొంది.