ఇచ్చోడ : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బోథ్ సివిల్ జడ్జి పీడీ కిరణ్ కుమార్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృతోత్సవ్లో భాగంగా బుధవారం మండలంలోని ముక్రా (కే) గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్టాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నామని పేర్కొన్నారు. గ్రామంలోని పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం జడ్జిని శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షీ, ఎంపీటీసీ గాడ్గె సుభాశ్, ఎస్ఐ ఫరీద్, న్యాయవాది రూపేందర్ సింగ్, ధమ్మపాల్, శంకర్, కోర్టు సిబ్బంది శశికళ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మేడిగూడ గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది రూపేందర్ సింగ్ మాట్లాడారు. చట్టాలు.. వాటి విలువ, వీటి ద్వారా జరిగే ఉపయోగాల గురించి మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, చదువుకుంటునే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.