నార్నూర్, మార్చి 11 : తల్లీబిడ్డల సంరక్షణకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మాతాశిశు, ఆరోగ్య శాఖల సంయుక్త నిర్వహణలో తల్లీబిడ్డల సంరక్షణే ధ్యేయంగా గర్భం దాల్చిన రోజు నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి క్రమం తప్పని వైద్యపరీక్షలు అందేలా ప్రణాళికలు, ఆరోగ్య స్థితిగతుల వివరాల నమోదు, చేయాల్సిన రక్తపరీక్షలు, ప్రసవ సమయంలో సరైన వైద్యం అందేలా జాగ్రత్తలు, బాలింత, పుట్టినశిశువు సంరక్షణకు సంబంధించిన అన్ని వివరాలు తల్లి చేతిలో ఉండేలా మాతాశిశు సంరక్షణ(ఎంసీపీ) కార్డులను ప్రభుత్వం అందజేస్తున్నది. దీంతో గర్భిణులు తమను తాము రక్షించుకునే విధంగా అన్ని వివరాలు పొందుపరచడంతో పాటు, శిశువు జన్మించిన నాటి నుంచి ఐదేళ్ల వరకు ఇచ్చే వ్యాక్సిన్ల వివరాలు ఉంటాయి.
ప్రభుత్వ దవాఖానలో ప్రసవమైతే ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్ పథకాల వివరాలు కూడా కార్డులో ముద్రించారు. ఈ కార్డులు బహుళ ప్రయోజనకరంగా ఉంటున్నాయి. నార్నూర్, గాదిగూడ మండలాల పరిధిలో మొత్తం గర్భిణులు, బాలింతలు 779, మూడేళ్ల లోపు చిన్నారులు 2192 మంది, 3 నుంచి 6ఏళ్ల లోపు చిన్నారులు 2850 మంది ఉన్నారు. ఈ మండలాల పరిధిలో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 154 అంగన్వాడీ కేంద్రాలు తల్లీబిడ్డల సంరక్షణకు పని చేస్తున్నాయి.
ఎంసీపీ కార్డులో పలు వివరాలు
మాతాశిశు సంరక్షణ ఎంసీపీ కార్డులు తల్లి ఆరోగ్య సంరక్షణతో పాటు బిడ్డలకు ఐదేళ్లు వచ్చే వరకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్ల వివరాలుంటాయి. చిన్నారులకు వ్యాక్సిన్లు, విటమిన్ ఏ ద్రావణం కార్డులో సూచించిన విధంగా వేయించాల్సి ఉంటుంది. దీంతో పాటు బిడ్డ వయస్సు, ఎత్తు, బరువు వివరాలు చార్ట్ రూపంలో ఉండడంతో బిడ్డల ఎదుగుదలలో ఏమైనా లోపాలు ఉంటే తల్లి స్వయంగా గమనించి వైద్యులకు తెలియజేసి సరైన వైద్యం పొందవచ్చు.
– రాజ్యమణి, వైద్యాధికారి, సీహెచ్సీ, నార్నూర్