దస్తురాబాద్,జూన్12 : దస్తురాబాద్ మండలంలోని భూత్కుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులోని మహాలక్ష్మి రైస్ మిల్ను గతేడాది అధికారులు బ్లాక్ లిస్టు(డిఫాల్ట్)లో పెట్టారు. ఇటీవల రైస్ మిల్లులో ఉన్న వే బ్రిడ్జిని రాత్రికి రాత్రే తరలించినట్లు సమాచారం. మళ్లీ గురువారం సాయంత్రం గుట్టు చప్పుడు కాకుండా మిషన్లు తరలించారు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు జగిత్యాల జిల్లా బీర్పూర్లో లారీని పట్టుకున్నారు.
అధికారుల కళ్లు గప్పి డిఫాల్ట్లో ఉన్న మిల్లు నుంచి యంత్రాల తరలించడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ విషయంపై పౌర సరఫరాల డీఎంను సంప్రదించగా రైస్ మిల్లు డిఫాల్ట్లో ఉన్నది వాస్తమేనని, మిషన్లు తరలిస్తున్న లారీని పట్టుకొని దస్తురాబాద్ పోలీస్స్టేషన్కి తీసుకువస్తున్నామని తెలిపారు. బ్లాక్లిస్టులో ఉన్న రైస్ మిల్ దగ్గర అధికారులు ఎలాంటి నేమ్ బోర్డుని ఏర్పాటు చేయకపోవడం, మిల్లుపై పర్యవేక్షణ లేక పోవడంతో మి షన్లను యజమానులు యథేచ్ఛగా తరలించడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రైస్ మిల్లులో తనిఖీలు..
మహాలక్ష్మి రైస్ మిల్లును శుక్రవారం పౌర సరఫరాల, రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాకు చెందిన వంగాల కిషన్, పల్లికొండ రాజు ఈ రైస్ మిల్లును నిర్వహిస్తున్నారు. గతేడాది ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యం ఇవ్వకుండా, రూ.13 కోట్ల బకాయిలు చెల్లించలేదని తెలిపారు. దీంతో మిల్లును బ్లాక్(డిఫాల్ట్ట్)లో పెట్టినట్లు తెలిపారు. నిల్వ ఉన్న వడ్లను బియ్యంగా పట్టించి అప్పగిస్తామని హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీని యజమానులు తెచ్చకున్నారు. బియ్యం ఇవ్వకుండా అధికారుల నుంచి 90 బ్యాగులు(22.5) క్వింటాళ్ల కేర్నస్(పోషక పదార్థాల ముడి సరుకుల సమ్మేళనం) తీసుకువచ్చినట్లు తెలిపారు.
బియ్యం ప్రభుత్వానికి ఇవ్వకుండా నూకలు పట్టి అక్రమంగా విక్రయించారని తెలిపారు. గురువారం సాయంత్రం రైస్ మిల్లు నుంచి అక్రమంగా వేరే చోటుకి మిషన్లను తరలించారని తెలియగానే ఆ లారీని జగిత్యాల జిల్లా బీర్పూర్ వద్ద పోలీసుల సాయంతో పట్టుకొని సీజ్ చేసి దస్తురాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకువస్తున్నట్లు తెలిపారు. రైస్ మిల్ యజమానులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. రైస్ మిల్ పౌర సరఫరా, రెవెన్యూ అధికారుల ఆధీనం లో ఉంటుందని వెల్లడించారు. ఈ తనిఖీల్లో సివిల్ సప్లయ్ డీఎం సుధాకర్, తహసీల్దార్ యాదవ రావు, సివిల్ సప్లయ్ డీటీ ప్రకాశ్, ఆర్ఐ ఆర్తీక, ఎస్ఐ సాయి కుమార్, జీపీవో కవిత, జూనియర్ అసిస్టెంట్ మధు,ఉన్నారు.