సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) /మాదాపూర్/శేరిలింగంపల్లి : తెలుగు చలన చిత్ర రంగంలో సూపర్స్టార్, దర్శకుడిగా ముద్రవేసుకున్న ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ (శివరామ కృష్ణమూర్తి) మంగళవారం తెల్లవారు జామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబంతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోక సంద్రంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు నానక్రామ్గూడ నివాసంలోని ఆయన పార్థివదేహాన్ని కడసారి చూసి నివాళులర్పించారు. కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
నివాళులర్పిస్తున్న సినీ హీరో దగ్గుబాటి వెంకటేశ్
కన్నీటి పర్యంతమవుతున్న మోహన్బాబు, చిత్రంలో మంచు విష్ణు
50 ఏళ్ల కిందటే పద్మాలయా స్టూడియోస్
తెలుగు సినీ రంగంలో హీరోగా విజయవంతంగా కొనసాగుతున్న కృష్ణ హైదరాబాద్ నగరంలో పద్మాలయా స్టూడియోస్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఒకవైపు సినీ హీరోగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకు సినిమాల పట్ల ఉన్న అభిరుచులకు అనుగుణంగా సొంతంగా సినిమాలు తీసేందుకు 1971లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో పద్మాలయా స్టూడియోను స్థాపించారు. ఆయన తన సోదరులైన జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావులతో కలిసి సుమారు 9 ఎకరాల స్థలంలో స్టూడియోను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో తెలుగు సినిమాలతో పాటు హిందీ చిత్రాలను సైతం నిర్మించారు. కృష్ణ చిత్ర సీమలో ప్రవేశించే నాటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు అగ్రశ్రేణి హీరోలుగా రాణిస్తున్నారు. వారి తరువాతి స్థాయిలో కాంతారావు, జగ్గయ్యలు ఉండగా, ఆ సమయంలో కృష్ణకు ఆడపాదడపగా సోలో హీరోగా అలరించేవారు. తన అన్నయ్య కృష్ణను సైతం టాప్ హీరోగా చూడాలని హనుమంతరావు, ఆదిశేషగిరిరావులు భావించి పద్మాలయా స్టూడియాస్ను ఏర్పాటు చేశారు. పద్మాలయా బ్యానర్పై తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కలిపి సుమారు 40 సినిమాల వరకు నిర్మించారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి ఏపీలో విస్తృత ప్రచారం
సూపర్ స్టార్ కృష్ణ నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ప్రముఖ పాత్ర పోషించారు. ఆంధ్ర ప్రాంతంలో తనదైన ముద్రను వేసుకున్నారు. చురుగ్గా వ్యవహరించారు. మాజీ ప్రధాని రాజీవ్గాంధీని అభిమానించే వ్యక్తిగా ఇందిరాగాంధీ మరణం తరువాత కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1984 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థుల గెలుపులో ప్రముఖ పాత్ర వహించారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ 1989లో ఏలూరు నుంచి లోక్సభ బరిలో దింపింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోళ్ల బుల్లి రామయ్యపై 71407 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎంపీగా గెలిచిన సమయంలో వివిధ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో ఉత్సాహంగా పాల్గొనే వారు. 1991లో మధ్యంతర ఎన్నికలు రావడంతో సిట్టింగ్ ఎంపీగా కృష్ణ మరో సారి పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి బోళ్ల బుల్లి రామయ్య చేతిలో 47655 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పట్లోనే రాజీవ్ గాంధీ హత్యకు గురికావడంతో ఆ తరువాత కాంగ్రెస్లో ఆయన కొనసాగినా క్రమక్రమంగా రాజకీయ కార్యకలాపాలను తగ్గిస్తూ వచ్చారు. 2003 తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం మద్దతు తెలిపింది. 1982లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా రాజకీయ ప్రకటనలు కూడా ఇచ్చారు. రాజకీయాలపై కృష్ణ సినిమాలు కూడా తీశారు. రాజకీయాల్లోకి రాకముందు ఈనాడు పేరుతో తీసిన సినిమా రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. జై ఆంధ్ర ఉద్యమానికి కృష్ణ మద్దతు తెలిపారు.
ప్రధాని, రాహుల్ సంతాపం
కృష్ణ తన అద్భుతమైన నటనా కౌశలంతో, ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సినీనటుడు కృష్ణ మృతి పట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. విలువలతో కూడిన ప్రజా జీవితానికి ఆయన ఒక ఉదాహరణగా నిలుస్తారని ట్విట్టర్లో పేర్కొన్నారు. మహేశ్ బాబు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గవర్నర్, కేంద్ర, రాష్ట్ర మంత్రుల సంతాపం
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జి.జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, సీహెచ్.మల్లారెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, వద్ది రాజురవిచంద్ర, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, తదితరులు సంతాపం తెలిపారు.