బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రం వసంత పంచమి సందర్భంగా జనసంద్రమైంది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షకుపైగా తరలివచ్చారు. గురువారం వేకువజాము నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. రికార్డు స్థాయిలో రూ.1000 అక్షరాభ్యాసాలు 4,046.., రూ.150 అక్షరశ్రీకారాలు 2,826.. మొత్తం 6,872 జరిగాయి. ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.65లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు, నమస్తే తెలంగాణ సీఎండీ, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు, ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్తో కలిసి అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాసర అమ్మవారి ఆలయ గర్భగుడితోపాటు పలు అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కాగా.. నమస్తే తెలంగాణ సీఎండీ, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు మనవడు హరీత్రీశ్వర్కు అక్షరాభ్యాసం చేయించారు.
బాసర, జనవరి 26 : చదువులతల్లి బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రం గురువారం వసంత పంచమి శోభను సంతరించుకున్నది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయింది. వేకువ జామున 2 గంటల నుంచే అమ్మవారి దర్శనంతో పాటు చిన్నారుల అక్షరాభ్యాసాల కోసం క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు భారీగా తరలి వచ్చారు. వేకువ జాము నుంచే బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. ముందుగా భక్తులు గోదావరిలో స్నానమాచరించి అమ్మవారి దర్శనానికి బయలుదేరారు.
వసంత పంచమిని పురస్కరించుకొని భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ర్టాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. దాదాపు లక్షకుపైగా భక్తులు వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు. దీంతో అమ్మవారి దర్శనానికి సుమా రు 6 గంటల సమయం, వీఐపీ దర్శానికి 2 గంటలకు పైగా సమయం పట్టింది. క్యూలైన్లలో గంటల తరబడి భక్తులు అమ్మవారి దర్శనానికి వేచి ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ, ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు, నమస్తే తెలంగాణ సీఎండీ (రాజ్యసభ సభ్యుడు) దీవకొండ దామోదర్రావు, ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్తో కలిసి అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయార్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వీరికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
వసంత పంచమిని పురస్కరించుకొని బాసరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏఎస్పీ కిరణ్ఖారే, సీఐ వినోద్రెడ్డి, బాసర ఎస్ఐ మహేశ్, మరో నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, దాదాపు 300 మంది పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ ట్రాఫిక్ నియంత్రణ చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉత్సవాలను ముగించారు.
వసంత పంచమి సందర్భంగా బాసర ఆలయంలో అధికారులతో పాటు బాసర గ్రామస్తులు, పలు సేవా సమితి భక్తులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి క్యూలైన్లోని చిన్నపిల్లలు, భక్తులకు తాగునీరు, పాలు, బిస్కిట్లు అందజేశారు. ఆలయం వద్ద ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
అమ్మవారి జన్మదినం వసంత పంచమి సందర్భంగా ఆలయంలో రికార్డుస్థాయిలో అక్షర శ్రీకార పూజలు నిర్వహించారు. రూ.1000 అక్షరాభ్యాసాలు 4046, రూ. 150 అక్షరాభ్యాసాలు 2826 కలిపి మొత్తం 6872 జరిగాయి. ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయం ద్వారా సరస్వతీ అమ్మవారికి ఒక్కరోజే రూ.65 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో విజయరామారావు తెలిపారు.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ గర్భగుడితో పాటు పలు అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలు సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రూ.8 కోట్లతో ఆలయ అతిథి గృహాల నిర్మాణంతో పాటు చుట్టూ ప్రహరీ పనులు ముగిశాయన్నారు. ఇప్పటి వరకు రూ.50 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభించిన అనంతరం మరో రూ.50 కోట్లు ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారని చెప్పారు. యాదాద్రిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. దశల వారీగా ఒక్కో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వసంత పంచమి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు, పోలీసు అధికారులు కృషి చేశారన్నారు.
బాసర, జనవరి 26 : సరస్వతీ అమ్మవారిని ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వసంత పంచమిని పురస్కరించుకొని అమ్మవారి సన్నిధికి చేరుకున్న సీఎండీ దామోదర్రావు-స్వరూపారాణిల కూతురు గౌతమి, అల్లుడు అనిరుధ్ల కుమారుడు పీ హరీత్రీశ్వర్కు అక్షర శ్రీకార పూజలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి ఐకేరెడ్డి కుటుంబ సభ్యులు సీఎండీ దామోదర్రావు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అనంతరం అక్షర శ్రీకార పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు చిన్నారి హరీత్రీశ్వర్కు అక్షశ్రీకారం చేయించి కుటుంబ సభ్యులందరికీ ఆశీర్వచనాలు అందజేశారు. అక్షరాభ్యాస కార్యక్రమంలో దామోదర్రావు కుమారుడు దీవకొండ రాఘవ, వియ్యంకులు పీ కళాధర్రావు-హరిప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎండీని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి అతిథి గృహంలో సన్మానించారు.