మందమర్రి, డిసెంబర్ 27: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తల్లీకూతుళ్ల ఆత్మహత్య కలకలం రేపింది. తమిళనాడులోని చెన్నై సమీపంలో గల ఉస్లంబట్టి గ్రామానికి చెందిన మహేందర్ దేవర మురుగన్ నాలుగేళ్ల క్రితం కుటుంబంతో కలసి వచ్చి మందమర్రిలోని దీపక్ నగర్లో అద్దె ఇంటిలో ఉంటున్నారు. వ్యాపారం చేస్తూ జీవనం సాగించే మురుగన్ మంగళవారం బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కాగా ఇంట్లో ఉన్న ఆయన భార్య ధనలక్ష్మి(36), కూతురు జీవని(16) మంగళవారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోనే ఉన్న కుమారుడు సిద్ధార్థ నిద్రలో ఉండగా ఇదంతా గమనించలేదు. బుధవారం నిద్ర నుంచి లేచిన సిద్ధార్థ తల్లి, సోదరి ఉరేసుకొని కనిపించడంతో స్పృహ తప్పి పడిపోయాడు.
కొంత సమయం తరువాత బంధువులకు సమాచారం ఇచ్చాడు. కాగా తాను పడుకునే సమయంలో తన తల్లి, సోదరి టీవీ చూస్తున్నారని, తెల్లారేసరికి ఇలా ఉరేసుకొని కనిపించారని చెబుతున్నాడు. ధనలక్ష్మి తల్లి కల్ల మాయ మాత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తన కూతురు, మనుమరాలు ఆత్మహత్య చేసుకొని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మందమర్రి సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ ఘటనాస్థలాన్ని సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన తరలించారు. అయితే ఇప్పటివరకు మురుగన్ ఆచూకీ లభించలేదు. ఆయన ఫోన్లో అందుబాటులో లేకపోవడంతో, ఆత్మహత్యకు కారణాలు పూర్తిస్థాయిలో తెలియరాలేదు.
మంచిర్యాల ఏసీసీ, డిసెంబర్ 27: మంచిర్యాల జిల్లాలో ఒక కరోనా కేసు నమోదైంది. బుధవారం జిల్లా వ్యాప్తంగా 146 మందికి కరోనా (ర్యాపిడ్) నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఆ వ్యక్తికి ర్యాపిడ్ టెస్ట్లో మాత్రమే పాజిటివ్ వచ్చిందని మళ్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసిన అనంతరం పాజిటివ్ వస్తే ఆ శాంపిల్ ను హైదరాబాద్ లోని జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్కు పంపించనున్నట్లు తెలిపారు. దీంతో చాలా రోజుల తరువాత జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు బయటపడడంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా భయందోళనకు గురవుతున్నారు. కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పటికే ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. కొవిడ్ సహాయం, ఇతర ఫిర్యాదులకు 7671001703 నంబర్ను సంప్రదించాలని తెలిపారు.