ఎదులాపురం, ఏప్రిల్ 16 : నారాయణపేట సభలో సీఎం రేవంత్రెడ్డి మాదిగలను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేశ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 80 లక్షల మంది మాదిగలు ఉన్నా.. ఒక్క సీటు ఇవ్వకుండా.. మాదిగలకు ఏదో ఒరగబెట్టినట్లు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాదిగలను అణచివేస్తూ.. ఒకే సామాజిక వర్గానికి రేవంత్రెడ్డి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమంపై మందకృష్ణ మాదిగ గురించి అహంకారంతో మాట్లాడడం సరికాదన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి శ్రీను, సందీప్, అజయ్, గణేశ్, రాజు పాల్గొన్నారు.