జైపూర్, జనవరి 31: ఇందారం ఓపెన్ కాస్ట్ గనిలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సూచించారు. జైపూర్ మండలంలోని టేకుమట్ల, గంగిపెల్లి, వేలాల గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే పర్యటించారు. టేకుమట్ల గ్రామంలో సింగరేణి నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. గంగిపెల్లిలో పల్లె దవాఖాన, వేలాలలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇందారంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ సింగరేణిని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు.
70 మిలియన్ టన్నులు ఉన్న బొగ్గు వార్షిక ఉత్పత్తిని లక్ష మిలియన్ టన్నులకు పెంచాలన్నారు. ఉత్పత్తి పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఇందారం, టేకుమాట్ల గ్రామాల యువత కోసం ఇకడ ఉన్న సింగరేణి స్థలంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి ఇవ్వాలని జీఎంకు సూచించారు. క్రీడా ప్రాంగణంలో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ నిర్మించి ఇవ్వాలని తెలిపారు. నియోజకవర్గంలోని మందమర్రి, జైపూర్లో సిల్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే సాధ్య సాధ్యలను పరిశీలించాలని తెలిపారు.
వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్లు గోనె సుమలత, లింగారెడ్డి, శ్యామల, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, ఇందారం ఓసీ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు ఫయాజ్, పార్టీ నాయకులు సత్యనారాయణ రెడ్డి, గుడెల్లి శ్రీనివాస్ రెడ్డి, తిరుపతిరెడ్డి, రికుల శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ ఓపెన్కాస్టు విస్తరణలో రామారావుపేట లోని దుబ్బపల్లి పూర్తిగా ముంపునకు గురైందనీ, నిర్వాసితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని మంగళవారం టేకుమట్లకు వచ్చిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి నిర్వాసితులు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో దుబ్బపల్లి భూనిర్వాసితుల వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కామెర రాజమలు, ఉపాధ్యక్షుడు రాజం, కోశాధికారి బండారి సంతోష్, బాధితులు ఉన్నారు.