ఆసిఫాబాద్, ఏప్రిల్ 20 : మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో అధికారికంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో కలెక్టర్ హేమంత్ బోరడే, ఎమ్మెల్యేలు ఆత్రం సకు, కోనేరు కోనప్ప, అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్పాయ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.
రంజాన్ పండుగను మైనార్టీలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని సూచించారు. పేద మైనార్టీ ముస్లింలకు ప్రభుత్వం తరఫున ఇప్పటికే రంజాన్ కానుకులు అందజేసినట్లు గుర్తుచేశారు. అనంతరం ఇఫ్తార్లో పాల్గొని ముస్లింలకు పండ్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్, మారెట్ కమిటీ చైర్మన్ గాదవెణి మల్లేశ్, సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి షేక్ మహమూద్, మైనార్టీ నాయకులు ఫయాజ్, అబ్దుల్లా, అసద్, సలాం, అహ్మద్ బిన్ అబ్దుల్లా, అహ్మద్, తారిక్, రహెమాన్, నిసార్ తదితరులు పాల్గొన్నారు.