దండేపల్లి, డిసెంబర్ 27: సత్యదేవుడి ఆశీస్సులు, కేసీఆర్ సర్కారు కృషితోనే గూడెం ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ సక్సెస్ అయ్యిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. గూడెం ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ రెండోసారి సక్సెస్ అయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎత్తిపోతల పథకంలో తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కేసీఆర్ సర్కారు హయాంలో జీఆర్(గ్లాస్ రీఎన్ఫోర్స్డ్)పైపులైను తొలగించి ఎంఎస్(మైల్డ్ స్టీల్) పైపులను వేశామన్నారు.
దీని ఫలితమే నేడు గూడెం ఎత్తిపోతల ఆయకట్టు రైతులకు యాసంగి పంటలకు నీరందే అవకాశం ఏర్పడిందన్నారు. గతేడాది రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమస్యను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించినట్లు గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మగూడెం వద్ద నిర్మిస్తున్న రాజీవ్సాగర్ నిర్మాణంలో వినియోగించిన ఎంఎస్ పైపులను గూడెం ఎత్తిపోతలకు వినియోగించడం వల్ల సమస్య పరిష్కారమైందన్నారు. దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
మంచిర్యాల ఏసీసీ, డిసెంబర్ 27: శివంకోటి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మంచిర్యాల విశ్వనాథ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శివంకోటి పూజ కార్యక్రమాన్ని కేవలం శ్రీశైలంలో, మంచిర్యాలలో మాత్రమే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత 57ఏండ్లుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వనాథ ఆలయ కమిటీ అధ్యక్షుడు దొంతుల ముఖేష్, మాజీ అధ్యక్షుడు సిరిపురం శ్రీనివాస్, భక్తులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.