బోథ్, డిసెంబర్ 18 : బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. సోమవారం బోథ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
అవసరమైన వాటిని తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యేగా తను ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఏ సమస్య ఉన్న నేరుగా తెలుపవచ్చన్నారు. సమావేశంలో ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, ఏఎంసీ చైర్మన్ రుక్మాణ్సింగ్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ నారాయణ్ రెడ్డి, ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతమ్రెడ్డి, నేరడిగొండ ఎంపీపీ రాథోడ్ సజన్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాహెర్ బిన్ సలాం, బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ప్రశాంత్, వివిధ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మండలంలోని ధన్నూర్(బీ) గ్రామం నుంచి నాగపూర్ వరకు రూ.2 కోట్ల 10 లక్షలతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఈ రోడ్డు మంజూరు చేయించానని తెలిపారు. అనంతరం రెడ్డి సంఘం సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇచ్చోడ, డిసెంబర్ 18 : మండల కేంద్రంలోని ఇచ్చోడ మెయిన్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే జాదవ్ అనిల్ భూమిపూజ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను జడ్పీటీసీ ఉన్న సమయంలో కేసీఆర్ రోడ్డు నిర్మాణానికి రూ.13 కోట్ల 60 లక్షలు మంజూరు చేశారన్నారు. ఇచ్చోడ మెయిన్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను తన హయాంలో పూర్తి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతమ్రెడ్డి, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఏనుగు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేరడిగొండ, డిసెంబర్ 18: ప్రభుత్వ కళాశాలలతో పాటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించిందన్నారు. పాఠశాలల్లో మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా మౌళిక సదుపాయాలు కల్పించామన్నారు. ప్రతి మండలంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యారంగంలో విద్యార్థులకు అన్ని రకాలుగా వసతులు కల్పించినట్లు గుర్తు చేశారు.
విద్యార్థులు విద్యారంగంలో ఉన్నతంగా రాణించి తల్లిదండ్రులతో పాటు గురువులకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కళాశాలలో రూ.8లక్షలు మూత్రశాలల నిర్మాణానికి వెచ్చించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, వైస్ఎంపీపీ మహేందర్ రెడ్డి, సర్పంచ్ వెంకటరమణ, వీడీసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ దేవేందర్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లే నానక్ సింగ్, నాయకులు సయ్యద్ జహీర్, సుజీల్ కుమార్, మదన్ సింగ్, కళాశాల ప్రిన్సిపాల్ శబనతర్నం, అధ్యాపకులు పాల్గొన్నారు.